– బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఆరూరి వివాదస్పద వ్యాఖ్య
విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ కడియం కావ్యకి వరంగల్తో ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ డిమాండ్ చేశారు. తను ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాకు చెందిన ముస్లిం మహమ్మద్ నజీరుద్దీన్ను ప్రేమించి పెళ్లాడిందని, ఆమె కడియం కావ్య కాదని, మహమ్మద్ కావ్య నజీరుద్దీన్ అని రమేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
ఆమె అత్తగారి ఊరు గుంటూరు అని.. ఆంధ్రా వాళ్లకి వరంగల్ పార్లమెంటు టికెట్ అవసరం ఏంటో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. వరంగల్లో గురువారం బీజేపీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో అరూరి రమేష్ చేసిన విమర్శలు ఒక్కసారిగా వివాదాస్పదంగా మారాయి. కావ్యతో పాటు ఆమె తండ్రి కడియం శ్రీహరి పై కూడా ఆరోపణలు చేశారు. కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగిన ద్రోహి శ్రీహరి అంటూ ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు వెన్నుపోటు పొడిచాడంటూ ఆరోపించారు. నేను గెలిస్తే మంత్రిని అవుతానని, బీఆర్ఎస్ లో నా వెంటే ఉంటూ నన్ను ఓడించడానికి కుయుక్తులు పన్నాడని విమర్శించారు. నన్ను పార్టీ నుండి సాగనంపి తర్వాత ఆయన పార్టీ మారారంటూ వ్యాఖ్యానించారు. పార్టీకి, దళితులకు అన్యాయం చేసిన కడియం శ్రీహరికి వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేసారు.