గత కేసీఆర్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసిన దుగ్యాల ప్రణీత్ రావు కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు
ఎస్ఐబీ డేటా ధ్వంసం విచారణలో పురోగతి
విధాత, హైదరాబాద్ : గత కేసీఆర్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసిన దుగ్యాల ప్రణీత్ రావు కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. ఎస్ఐబీ కార్యాలయంలోని రెండు గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్రావు అనధికారికంగా రహస్య సమాచారాన్ని సేకరించినట్లు అధికారులు గురించారు. అలాగే పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల స్వాధీనం చేసుకున్న కొన్ని కంప్యూటర్లలో కీలక రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ డివైసుల్లోని డేటా, ఇతర డాక్యుమెంట్లు మాయమైనట్లుగా ఎస్ఐబీ గుర్తించింది. గత ప్రభుత్వం ఆదేశాలతో వారికి అనుకూలంగా ప్రతిపక్షాలు, అధికారుల ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన డీఎస్పీ ప్రణిత్రావు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కుల్లోకి మార్చుకున్నట్లు, మరికొంత సమాచారాన్ని ధ్వంసం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రణీత్ రావు మీద ఏపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపీపీ, ఐటీ యాక్ట్లను పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణిత్రావును డీజీపీ రవిగుప్తా సస్పెండ్ చేశారు.