చెరువుగట్టులో ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం తెల్లవారుజామున లక్షలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు

చెరువుగట్టులో ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం
  • హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల దంపతులు


విధాత : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం తెల్లవారుజామున లక్షలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో చెర్వుగట్టు గుట్ట పరిసరాలన్ని భక్తజనసంద్రంగా మారగా, ఆయల పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కల్యాణోత్సవంలో పాల్గొనగా, స్థానిక నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్లీ ఎప్పుడూ రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు నిర్మిస్తామని, భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మూడు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయిస్తామని, మొదటి విడతలో 60వేల ఎకరాలకు నీటి విడుదల చేస్తామన్నారు. అదే రోజు మహాత్మగాంధీ యూనివర్సిటీ, చెర్వుగట్టు అభివృద్ధిపై సమీక్ష ఉంటుందన్నారు. రాబోయే కాలంలో బ్రాహ్మణ వెల్లంల, ఎస్‌ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తామని, ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరించి పేదల గుండెల్లో ఉంటామన్నారు.