తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో 18-19ఏండ్లున్న ఓటర్లు 9.9లక్షల మంది ఉన్నారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో 18-19ఏండ్లున్న ఓటర్లు 9.9లక్షల మంది ఉన్నారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. గురువారం ఆయన పోలింగ్ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం 36వేల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు. ఈ సారి కొత్తగా 51లక్షల ఓటర్ కార్డులు ప్రింట్ చేసి తపాలాశాఖ ద్వారా పంపిణీ చేశామన్నారు. ఎన్నికల్లో 60 మంది వ్యయ పరిశీలకులను నియమించామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో పనిచేసే వారిని 3 కేటగిరీలుగా గుర్తించి వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించామని తెలిపారు.
ఇప్పటికే 9 వేలకు పైగా ఓటర్లు హోం ఓటింగ్ వేశారన్నారు. సర్వీసు ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఇప్పటికే 88శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 5వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ప్రతి కౌంటింగ్ సెంటర్కు ఒక పరిశీలకుడు ఉంటారని తెలిపారు.