సెప్టెంబర్ 15న వరంగల్ సింహగర్జనలో మ్యానిఫెస్టో CM KCR | విధాత, తెలంగాణలో మూడోసారి కూడా అధికారం బీఆరెస్ పార్టీదేనని బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపామన్నారు. తొమ్మిదేళ్ల క్రితం కరెంటు బాధతలు తలుచుకుంటే భయమేస్తుందన్నారు. ఉజ్వలమైన, ఉత్కృష్టమైన రీతిలో తెలంగాణ ఐటీ, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇందుకు చోదక శక్తిగా […]
CM KCR | విధాత, తెలంగాణలో మూడోసారి కూడా అధికారం బీఆరెస్ పార్టీదేనని బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపామన్నారు.
తొమ్మిదేళ్ల క్రితం కరెంటు బాధతలు తలుచుకుంటే భయమేస్తుందన్నారు. ఉజ్వలమైన, ఉత్కృష్టమైన రీతిలో తెలంగాణ ఐటీ, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇందుకు చోదక శక్తిగా బీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేశారన్నారు. పసికూనవంటి కొత్త రాష్ట్రాన్ని తక్కువ వనరులున్నప్పటికి ఇవ్వాలా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్గా నిలిపామన్నారు.
ఎన్నికలంటే ప్రతిపక్షాలకు గేమ్ అని, మాకు మాత్రం ఒక టాస్క్, పవిత్ర యజ్ఞమన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఉందన్నారు. 1లక్ష 20వేల నుంచి 3లక్షల 10వేల వరకు తలసరి ఆదాయం పెరిగిందన్నారు. తలసరి విద్యుత్తు వినియోగంలో కూడా తెలంగాణ నెంబర్ వన్ అన్నారు. అన్ని రంగాలకు 24గంటల నాణ్యతతో కూడిన కరెంటును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
గుజరాత్,మహారాష్ట్ర ,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే ముందుందన్నామన్నారు. సంక్షేమంలోనే కాదు.. ఇంటింటికి మంచినీటిని అందించిన ఏకైక రాష్ట్రంగా, ఐటీ, విద్యుత్తులో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపామన్నారు. హైద్రాబాద్ మౌలిక వసతుల అభివృద్ధితో ఎట్లా అభివృద్ధి చెందింతో చూశారని, అట్లానే పాత రంగారెడ్డి, హైద్రాబాద్లలో 29 సీట్లకు 29మేమే గెలుస్తామన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలే కాదు.. ఎంపీ ఎన్నికల్లో కూడా 17సీట్లు గెలుస్తామన్నారు.
గతంలో మాదిరిగానే మజ్లీస్, బీఆరెస్ లు చెట్టాపట్టాల్ వేసుకుని మిత్రపక్షాలుగా ఎన్నికలకు వెలుతాయన్నారు. మజ్లీస్ స్థానాల్లో ఫ్రెండ్లీ కాంటెస్టు ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో 95-100సీట్లు గెలువాలని మా అంచనా అన్నారు. పార్టీకి ఉండే అంచనాలు..అనేక సర్వేలు…అంతర్గత నెట్వర్క్ లన్నింటిని విశ్లేషించి అభ్యర్థులను నిర్ణయించామని, రాష్ట్ర ప్రగతిని కొనసాగించేలా ప్రజలు వారిని ఆశీర్వదించి గెలిపించాలన్నారు.
పరిస్థితుల మేరకు ఏడుగురు సిటింగ్ అభ్యర్థులతో పాటు తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందన్నారు. మరో నాలుగు స్థానాలు పెండింగ్లో పెట్టామన్నారు. ఖరారైన అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులుంటే వారే సర్ధుబాటు చేసుకుంటారని, నియోజకవర్గాల్లో అభ్యర్ధిత్వంపై నెలకొనే సమస్యల పరిష్కారానికి త్రిమెన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అభ్యర్థుల ఖరారులో పార్టీ నిర్ణయాన్ని కాదంటే ఎంతటివారినైనా తీసిపారెస్తామన్నారు. రాజకీయ జీవితం అంటే అసెంబ్లీ అభ్యర్ధిత్వం ఒక్కటే కాదని ఇంకా అనేక పదవుల రూపంలో అవకాశాలుఉన్నాయని, ఆగం కాకుండా బయటకు పోకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయండని, భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందన్నారు.
కాగా.. తాను కామారెడ్డి, గజ్వేల్ రెండుచోట్ల పోటీ చేస్తున్నానని, కామారెడ్డి ఎమ్మెల్యే, మంత్రుల కోరిక మేరకు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా తెలిపారు. వరంగల్లో సెప్టెంబర్ 15న సింహగర్జన సభకు ఉంటుందని, ఆ సభలోనే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సాధించిన ప్రగతికి అమలు చేసిన సంక్షేమ పథకాలు నిదర్శనమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని మెడికల్ కళాశాలలు తెలంగాణలో ఏర్పాటు చేశామన్నారు.
కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లు పాలించిన 200 రూపాయల పింఛన్ ముఖాన కొట్టి మళ్లా చాన్స్ అడుగుతారా అంటు ప్రశ్నించారు. బీఆరెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఇవ్వని హామీలనే ఎక్కువ అమలు చేశామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతి ఆరోపణలు చేస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, అవినీతిలో వారికంటే మించినోళ్లు దేశంలో లేరన్నారు.
ప్రజలకు మా పథకాలపై, హామీలపై పాలనపై నమ్మకం ఉందని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిందని, మేం లక్ష రూపాయలు చేస్తామని చెప్పామని, ప్రజలు మమ్మల్నే నమ్మి ఓటేశారన్నారు. కొన్ని మీడియా సంస్థలు మా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వార్తలు ప్రచురిస్తున్నారని, మాకు వ్యతిరేక శక్తులకు యాడ్లు ఎందుకు ఇవ్వలంటు ప్రశ్నించారు.