CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గెలవబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతం కంటే ఐదారు ఎక్కువ సీట్లతో బీఆర్ఎస్ గెలవబోతోంది.. అందులో అనుమానమే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలవాలన్నారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. సభకు వచ్చిన జనాలను చూస్తుంటే సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని […]
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గెలవబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతం కంటే ఐదారు ఎక్కువ సీట్లతో బీఆర్ఎస్ గెలవబోతోంది.. అందులో అనుమానమే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలవాలన్నారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు.
సభకు వచ్చిన జనాలను చూస్తుంటే సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని ఖాయమైపోయింది. అది మీరు రుజువు చేశారు అని జనాన్ని ఉద్దేశించి కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం నీటితో పంటలు అద్భుతంగా పండుతున్నాయి.
ఇవాళ సూర్యాపేటకు కూడా కాళేశ్వరం జలాలు వచ్చాయి. ఆ నీటితో రావి చెరువు నిండింది. హుజుర్నగర్లో పెద్ద పెద్ద మొనగాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ రైతులను పట్టించుకోలేదు. ఎమ్మెల్యే సైదిరెడ్డి చొరవతో సాగర్ కాల్వల సిమెంట్ లైనింగ్ పనులు మొదలయ్యాయి. నీళ్లు అందిస్తున్నాం. ఇవన్నీ కట్టుకథలు, పిట్టకథలు కావు అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
నేల విడిచి సాము చేసినట్టు డైలాగులు చెప్పారు తప్ప ప్రజల బాధలు పట్టించుకోలేదని గత ప్రభుత్వాలపై కేసీఆర్ ద్వజమెత్తారు. మొన్న కాంగ్రెసాయన పాదయాత్ర చేస్తూ.. సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని నిరూపిస్తారా అని అడిగారు. ఎక్కడ చూసినా కాళేశ్వరం నీళ్లే కనిపిస్తున్నాయి. రావి చెరువు కాళేశ్వరం నీళ్లతో నిండుతోంది. సాగు, తాగనీరు అందిస్తున్నాం.
ఇదే సూర్యాపేటలో మూసీ మురికి నీళ్లు తాగించారు. ఇవాళ పాలధారలాంటి మంచినీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఈ సదుపాయాలు మెరుగు కావాలి. ఇంకా అభివృద్ధి జరగాలి. 30 వేల కోట్లతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నాం. ఇంకా చాలా అద్భుతాలు జరగాల్సి ఉంది. హైదరాబాద్ విశ్వనగరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఈ అభివృద్ధి, సంక్షేమం ఇదే విధంగా కొనసాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
రెండు పర్యాయాలు కలిపి రూ. 37 వేల కోట్ల రుణమాఫీ చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ భారతదేశంలో ఎవరూ రుణమాఫీ చేయలేదు. ఎరువులు, విత్తనాలు మంచిగా దొరుకుతున్నాయి. కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రైతులు ఇప్పుడే అప్పుల నుంచి విముక్తి అవుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు దేశానికే గర్వకారణంగా తయారవుతారు.
కష్టపడేది రైతులే.. ఇవాళ మూడు కోట్ల టన్నుల వడ్లను పండిస్తున్నది. సీతారామం, పాలమూరు పూర్తి అవుతే 4 కోట్ల టన్నులకు పోతాం. మన రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లులు సరిపోవట్లేదు. కోటి టన్నులను అమ్ముతున్నది ప్రభుత్వం. పాలమూరు జిల్లాలోని నడిగడ్డను చూసి వలవల ఏడ్చినం. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాలు చల్లగా ఉండాలి. రైతులు మంచిగా ఉండాలి. వలసలు వాపస్ వచ్చాయి. రైతులు దర్జాగా పైకి వస్తున్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి అని కేసీఆర్ సూచించారు.