అంగరంగ వైభవంగా భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వరంగల్ మహానగరంలో కొలువైఉన్న భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగార క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంగరంగవైభవంగా అంకురార్పరణ జరిగింది
- భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభం
- పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ సిరికొండ
- ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
విధాత, ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ మహానగరంలో కొలువైఉన్న భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగార క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంగరంగవైభవంగా అంకురార్పరణ జరిగింది. ఈ నెల 19 ఆదివారం నుండి 30-వ తేదీ గురువారం వరకు అత్యంత వైభవోపేతంగా శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరిగింది. ఉదయం గం॥ 4-00లకు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట ఆలయ అర్చకులు ఉత్సవాంగీకార ప్రార్ధన జరిపారు. అనుజ్ఞ లభించిన వెంటనే అమ్మవారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, నాంది, ఇడాహవాచనం, బ్రహ్మకూర్చహెూమం, పంచగవ్య ప్రాశన, ఋత్విగ్వరణం, మధుపర్కవిధి జరిపి వాస్తుయాగం, పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, ధ్వజాధివాస కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం గణవతి సేవను, సాయంకాలం శ్రీ సుబ్రహ్మణ్య సేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపారు.

ఈ బ్రహ్మోత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అందించిన రూ. 10 లక్షల విరాళంతో నిర్మించిన జర్మన్ పెండాల్స్ ను ఆవిష్కరించి, ధర్మకర్తల మండలి కార్యాలయమును ప్రారంభించారు. తదుపరి ప్రతిసరబంధం, ఉదకశాంతి నిర్వహించి రక్షోఘ్న హెూమం అనంతరం బ్రహ్మోత్సవ అంకురార్పణ జరిపి సాయంతన పూజ నిర్వహించారు. ఈ అంకురార్పణ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సిరికొండ మధుసూదననాచారి, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ త్రిమూర్తుల గౌరిశంకర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు వందలాదిగా చొల్లేటి కృష్ణమాచారి నేతృత్వంలో మేళతాళాలతో పట్టుచీరలు, పూజాద్రవ్యాలు అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రముఖులు పెందోట సురేష్కుమార్, పొడిశెట్టి విష్ణువర్ధన్, బండ్లోజు నర్సింహాచారి, శ్రీరామోజు నాగసోమేశ్వర్, మండలోజు జగన్, బొజ్జా రవీందర్ రావు, కొక్కొండ రాజేంద్రప్రసాద్, సిద్దోజు వీరన్న, గజ్జెల వీరన్న, వీణవంక సదానందం, ఆరోజు సురేందర్, రాంబాబు, గుగ్గిళ్ళ శశిరేఖ, చెంగెల్లి హేమలత, భారతి, బెజ్జంకి పూర్ణాచారి, రాధాకృష్ణ, శ్రీనివాసచారి, సదాశివుడు, అద్దంకి నాగేశ్వర్రావు, పెందోట శ్రీనివాస చారి, మదుపు సత్యనారాయణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చిలుకూరి లక్ష్మిరామాచారి, రాష్ట్ర నాయకులు యశోద, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం సుబ్రహ్మణ్య సేవ న్యాయవాది మాతంగి రమేష్- డా॥ కృష్ణవేణి దంపతులు, శ్రీ గోవిందు నాగరాజు–శ్యామల దంపతులు సౌజన్యంతో మాదిగ కులస్తులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, పెండాల్స్, చల్లటి మంచినీరు, మజ్జిగ, ఉచిత ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్ కమీషనర్ రామల సునీత పరిశీలించారు. సోమవారం ఉదయం 11గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతాయని ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు.
Read More:
ఏలియన్ల రహస్యాలు అతి త్వరలో.. : ట్రంప్ తాజా సంచలనం
నాసా ప్రపంచపు నైట్లైట్ మ్యాప్లో యూపీ-బీహార్ ‘హైలైట్’

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram