ప్రధాని నరేంద్ర మోదీతో కేరళ సీఎం పినరయి విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని.. పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్ ... కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు
అభివృద్ధిలో కేరళ వెనుకబాటు
వాయనాడ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి
విధాత: ప్రధాని నరేంద్ర మోదీతో కేరళ సీఎం పినరయి విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని.. పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్ … కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాహుల్గాంధీ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయకుండా మతతత్వ బీజేపీతో కలిసి విజయన్ పని చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయని, కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయడం లేదన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగిపోయారని, బంగారం స్మగ్లింగ్ లో సీఎం విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. సీఎం విజయన్ పై ఈడీ, ఆదాయపన్ను కేసులున్నా.. ఆయనపై మోదీ చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఈడీ, ఆదాయపన్ను కేసులున్నన్ని రోజులు సీపీఎం పార్టీ కోసం విజయన్ పనిచేయలేరని ఆరోపించారు. వాయనాడ్ లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్కు కేరళ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు ఇస్తున్నారని, సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు..తెలివైన వారని, కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయేగాని కానీ కేరళ మాత్రం అభివృద్ధి కాలేదన్నారు.
మోదీ పరివార్..ఇండియా పరివార్ మధ్య వార్
మణిపూర్ లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గుండాల చేతిలో చనిపోయారని, ప్రధాని మోదీ, అమిత్ షా మణిపూర్ లో పర్యటించలేదని, కాని రాహుల్ గాంధీ అక్కడి బాధితులను కలిశారని గుర్తు చేశారు. దేశంలో రెండు పరివార్ ల మధ్య పోరాటం జరుగుతోందని, మోదీ పరివార్ లో ఈడీ, ఈవీఎం లు, సీబీఐ, ఇన్కంటాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని, ఇండియా పరివార్ లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాయనాడ్ కుటుంబ సభ్యులున్నారన్నారు.
ఇందిరా , రాజీవ్ లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. వాయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారని, నేను ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ పై వాయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే నేను తెలంగాణ నుంచి వచ్చానని, తెలంగాణ నుంచి పోటీ చేయాలని మేం రాహుల్ గాంధీని కోరామని, ఆయన వాయనాడ్ వైపే మొగ్గు చూపారన్నారు.
గత ఎన్నికల్లో వాయనాడ్ లో 65 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ సారి 75 శాతం ఓట్లు రావాలన్నారు. మోదీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నామని, వారణాసి వర్సెస్ వాయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందని చెప్పారు. వాయనాడ్ ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదు…దేశానికి కాబోయే ప్రధానికి అని, రాసిపెట్టుకోండి… జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధాని గా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు.