విధాత: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కలిసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో ములసం మొదలైందా? రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేరు.. బీజేపీలోకి రావాలని రాజగోపాల్రెడ్డి అసమ్మతి నేతలకు ఆహ్వానం పలుకడం దాన్ని బలపరుస్తున్నదా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని ఆ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది. కానీ ఈ ఇద్దరు అన్నదమ్ములు రేవంత్కు టీపీసీసీ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచే ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. పీసీసీ కార్యకవర్గ కూర్పు కారణంగా చూపి పార్టీలో […]
విధాత: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కలిసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో ములసం మొదలైందా? రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేరు.. బీజేపీలోకి రావాలని రాజగోపాల్రెడ్డి అసమ్మతి నేతలకు ఆహ్వానం పలుకడం దాన్ని బలపరుస్తున్నదా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని ఆ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది.
కానీ ఈ ఇద్దరు అన్నదమ్ములు రేవంత్కు టీపీసీసీ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచే ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. పీసీసీ కార్యకవర్గ కూర్పు కారణంగా చూపి పార్టీలో చీలక తెచ్చే ప్రయత్నం జరుగుతున్నదా? దానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆజ్యం పోస్తున్నారా? అనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది.
రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ ఏది అంటే సామాన్యుల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు ఎలాంటి శషబిషలు లేకుండా కాంగ్రెసే అంటారు. బీజేపీ నేతలు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నా.. ఆ పరిస్థితులు లేవు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ అధిష్ఠానం రూట్ మార్చినట్టు కనిపిస్తున్నది.
అస్సాం రాష్ట్రంలో అమలు చేసిన విధానాన్నే ఇక్కడ కూడా చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను ముందు పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ను నిట్టనిలువుగా చీల్చి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. ఎందుకంటే అక్కడ బీజేపీ చాలాకాలంగా పనిచేస్తున్నా బలమైన బేస్ ఏర్పాటు కాలేదు.
దీంతో అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలకు గాలం వేసింది. దానికి అప్పటి సీఎం తరుణ్ గొగొయ్కు వ్యతిరేకంగా గళం విప్పిన నేతలందరినీ తనవైపు తిప్పుకున్నది. ప్రస్తుతం టీపీసీసీ కమిటీల కూర్పు రాష్ట్ర కాంగ్రెస్లో సంక్షోభానికి కారణమనే ప్రచారం జరుగుతున్నా అసలు కథ రేవంత్రెడ్డే అసమ్మతి నేతల టార్గెట్ అన్నది సత్యం.
ప్రస్తుతం పీసీసీ కార్యవర్గ కూర్పుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న నేతలంతా మంత్రులు, ఎమ్మెల్యేలుగా, పనిచేసిన వారే. ఉత్తమ్ ఎంపీగా, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు ఎమ్మెల్యేలుగా, జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్లంతా వారి వారి నియోజకవర్గాల్లో పట్టున్న నేతలే. వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లే. రాష్ట్రంలో అధికారం కోసం శ్రమిస్తున్నా ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతల్లో 10నుంచి 15 మంది నేతలు తప్పా మిగిలిన వాళ్లెవరూ గెలవలేరు అన్నది ఆ పార్టీ అధిష్ఠానం గ్రహించింది.
కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీలో రగిలిన చిచ్చును తనకు అనుకూలంగా మలుచుకుని 15-20 మంది తాజా, మాజీలను పార్టీలో చేర్చుకుంటే 30-40 స్థానాలు గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అన్నది మోడీ, షాల ఆలోచన. దీనికి అనుగుణంగానే కార్యాచరణ రూపొందించుకుని ఆ ప్రణాళికలను అమలుచేసే బాధ్యలను కోమటిరెడ్డి బ్రదర్స్కు అప్పగించినట్టు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఎన్నికలకు ముందు వెల్లడిస్తానని వెంకట్రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీనియర్ల వ్యాఖ్యలకు నిరసగా 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. అయినా అసంతృప్తి నేతలు వెనక్కి తగ్గినట్టు కనిపించడం లేదు. పీసీసీ కార్యవర్గ కూర్పే ప్రస్తత సంక్షోభానికి కారణంణా అసమ్మతి నేతలు నిరసనను వ్యక్తం చేశారు. ఈ విషయం పార్టీ అధిష్ఠాన దృష్టికి కూడా వెళ్లింది.
పార్టీ సమస్యలను అధిష్ఠానమే చూసుకుంటుందని రేవంత్రెడ్డి కూడా చెప్పారు. ఇంత జరిగినా ఈ వివాదం కొనసాగుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ దీనిపై అతిగా స్పందిస్తున్నారు. ఇదంతా వెంకట్రెడ్డి ప్రధానిని కలిసిన తర్వాతే తారాస్థాయికి చేరింది అనే వాదనలో కొంత వాస్తవం ఉన్నట్టు తెలుస్తోంది.