తెలంగాణ శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు
విధాత : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించింది. అనంతరం ఎంఐఎం శాసనసభ పక్ష నేతగా అక్బరుద్దీన్ ను, సీపీఐ పక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది.
అయితే 42 పేజీల శ్వేత పత్రం బుక్లెట్ను అందించి నాలుగు నిమిషాల్లో చర్చను ప్రారంభించామనడం పట్ల ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్వేత పత్రం అధ్యయనం చేసేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థించారు. అయితే గతంలో అనుసరించిన సాంప్రదాయం మేరకే లఘు చర్చను ప్రారంభించామని సభ్యులు చర్చను కొనసాగించాలని శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, భట్టిలు కోరారు. అక్భరుద్ధిన్ సైతం సమయం కావాలని కోరారు. దీంతో టీ విరామం ముగిశాక చర్చను కొనసాగించేందుకు సన్నద్దం కావాలని శ్రీధర్బాబు, భట్టిలు సూచించారు.