పేదల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాపాలన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు
విధాత, హైదరాబాద్ : పేదల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాపాలన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం కోదాడ మండలం, రెడ్ల కుంటలో 47.64 కోట్లతో రెడ్ల కుంట ఎత్తిపొతల పధకం, 5.30 కోట్లతో ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకాల పనులను ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్, మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్రావులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గార్యంటలను వంద రోజుల్లోగా అమలు చేస్తుందని, ప్రజలకిచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. బీఆరెస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీఆరెస్ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని సర్వ నాశనం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగ చేసిందని, ఎన్నో లిఫ్టు స్కీమ్లను మూలన పడేసిందని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన మూడ నెలల్లోపే 10వేల ఎకరాలకు సంబంధించిన రెండు లిఫ్టు ఇరిగేషన్ పథకాల పనులు ప్రారంభించుకున్నామంటే మంత్రి ఉత్తమ్ పట్టుదలకు, పనితీరుకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఉత్తమ్, పద్మావతిలు 50వేల మెజార్టీతో గెలుస్తామని లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్పడం మాకు ఆందోళన కల్గించేదని, కాని ఆయనతో మంత్రిగా కలిసి పనిచేస్తున్న తీరు చూస్తే అలా ఎందుకు చెప్పారో అర్ధమైందన్నారు. కోదాడ, హుజర్నగర్ రెండు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరీ చేస్తామని ప్రకటించారు. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాలకు మంచి విద్యను అందించాలన్న ఉత్తమ్ తపన అభినందనీయమన్నారు.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు కోదాడలో రెండు లిఫ్టులకు శంకుస్థాపన చేశామని, నియోజవర్గంలోని అన్ని లిఫ్టులు తిరిగి పునరుద్దరిస్తామని ప్రకటించారు. ఇటీవల వైద్యశాఖ మంత్రితో 26కోట్లతో 100పడకల ఆసుపత్రి మంజూరీ చేశామని, 2.50కోట్లతో సిటీస్కాన్ మంజూరీ చేయించామని ఏడాదిలోగా వాటి పనులు పూర్తి చేయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కార్డులు లేని వారందరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుందని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు పదేళ్లుగా బీఆరెస్ నిర్వీర్యం చేసిందని, ఇప్పుడు మా సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలు మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలిచ్చేందుకు 1500కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఇండ్లు లేని వారికి మహిళల పేరుతో 5లక్షల సహాయం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్నామని గుర్తు చేశారు. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ వసతి, 10లక్షల ఆరోగ్య శ్రీ బీమా అందిస్తున్నామని తెలిపారు. మేం ఎప్పుడు చెప్పినట్లుగానే హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గం ప్రజలే మా పిల్లలు, మాకు కుటుంబమని, మీ అభిమానంతోనే పద్మావతి రాష్ట్రంలో అధిక శాతం ఓట్లతో గెలిచిందన్నారు. గత 30ఏండ్లుగా మీతో నాకు కుటుంబ సంబంధం ఉందన్నారు. మీకు ఏపని ఉన్నా తన వద్దకు వచ్చి పని చేయించుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో త్వరితగతిన పనులు ప్రారంభించేందుకు ఒక్క రోజునే మక్తల్, కోదాడ, వైరా, మధిర నియోజకవర్గాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నామన్నారు.
ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ మాట్లాడుతూ తన నియోజకవర్గానికి రెండు లిఫ్టులకు నిధులివ్వడంతో పాటు ఇంటిగ్రేడెట్ స్కూల్ సహా 100రోజుల్లోగానే 200కోట్ల అభివృద్ధి పనులు మంజూరీ చేసిన భట్టి, ఉత్తమ్లకు కృతజ్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు సహా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.