వచ్చే ఎన్నికల్లో ప్రజలే కెసిఆర్కు లగ్గం చేస్తరు.. రాజన్న గుడి అభివృద్ధి మరచిన కేసీఆర్ కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి Discrimination in KCR regime too: Revanth Reddy విధాత: వేములవాడ రాజన్న గుడికి ప్రతి ఏడు రూ.100 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసి ఘనంగా అభివృద్ధి చేస్తానని చెప్పిన సిఎం కెసిఆర్ మాట తప్పాడని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు. గుడి అభివృద్ధి చేయకపోగా […]
Discrimination in KCR regime too: Revanth Reddy
విధాత: వేములవాడ రాజన్న గుడికి ప్రతి ఏడు రూ.100 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసి ఘనంగా అభివృద్ధి చేస్తానని చెప్పిన సిఎం కెసిఆర్ మాట తప్పాడని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు. గుడి అభివృద్ధి చేయకపోగా కనీసం వేములవాడలో తాగునీటి సమస్యను కూడా తీర్చలేకపోయారని అన్నారు.
ఇవాళ రాత్రి వేములవాడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో స్థానిక ప్రజలను ఉద్ధేశించి రేవంత్రెడ్డి ప్రసంగించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ ఓడిపోతారనే భయంతో సూరమ్మ ప్రాజెక్టుకు హడావుడిగా శిలా ఫలకం వేశారన్నారు. సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి రైతులను మభ్యపెట్టి మాయ చేశారన్నారు. ఇన్నేళ్లు అయినా తట్టెడు మట్టి తీయలేదని, నిధులు ఇవ్వలేదన్నారు. అంటే ఈ నియోజకవర్గంపై కెసిఆర్కు ఎమ్మెల్యే రమేష్కు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుందన్నారు. ఉమ్మడి ఏపిలో కొనసాగిన వివక్షనే కెసిఆర్ పాలనలో కొనసాగుతుందని, మనుషులు మాత్రమే మారారని అన్నారు.
నలభై సంవత్సరాల క్రితం రాజన్న గుడిలోనే తన పెళ్లి జరిగిందని, తప్పకుండా అభివృద్ధి చేస్తానని కెసిఆర్ గోల్ మాల్ మాటలు చెప్పాడన్నారు. అప్పుడు ఆయన లగ్గం ఇక్కడ జరిగిందో లేదో తెలియదు కాని వచ్చే ఎన్నికల్లో కెసిఆర్కు ప్రజలు తప్పకుండా లగ్గం చేస్తారన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్నదని, స్థానిక ఎమ్మెల్యే రమేష్ను కలవాలంటే జర్మనీ కి పోవాల్సిన ఖర్మ ఓటర్లకు పట్టిందని రేవంత్ విమర్శించారు. ఇక్కడి ప్రజలపై ప్రేమ లేదని, అందుకే భారత పౌరసత్వం వదులుకున్నారన్నారు. వేములవాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.
మిడ్ మానేరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కెసిఆర్ కుటుంబం పరిహారం తీసుకుందని, కాని పెళ్లైన గిరిజన బిడ్డలకు మాత్రం పరిహారం లేదంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ కుటుంబానికి ఒక న్యాయం, మా గిరిజన బిడ్డలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. వేల కోట్లు ఉన్న మీ కుటుంబం పరిహారం తీసుకుని, గిరిజనులను పొట్టగొడతరా అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చిన అని గొప్పలు చెప్పుకుంటున్న కెసిఆర్కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.
ప్రతి పేదవాడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు, ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఎల్.పి.జి సిలిండర్ ను రూ500 కె ఇస్తామని, సూరమ్మ ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని, గల్ఫ్ కార్మికులను ఆదునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.