జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు ప్రకటించిన లాటరీ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది
విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు ప్రకటించిన లాటరీ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తెలంగాణలో దసరా పండుగ అంటేనే చుక్క, బొక్క. కుటుంబ సభ్యులు, బంధువులు అంత ఒక్కచోట చేరి తీరైన మద్యం బ్రాండ్ల సీళ్ళు విప్పుతుంటే, అందులోకి నాటుకోడో, మేక కూరో తోడుగా ఉండాల్సిందే! అందుకే దసరా రోజుల్లో గ్రామాలు, పట్టణాల్లో ఏ ఇంట్లో చూసినా వండి వార్చే.. మసాలాలతో కలిపిన మాంసం ఘుమఘుమలు.. జిహ్వ చాపల్యం కలవారికి నోరూరించక తప్పవు.
దీన్ని వ్యాపారంగా మార్చితే ఎలా ఉంటుందని ఆలోచించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మొత్తం మీద తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద రూ.50 చెల్లించి లాటరీ టికెట్ కొంటే చాలు… దసరా పండుగ నాడు తీయబోయే డ్రాలో అదృష్టం బాగుంటే మీకో మేకనో, గొర్రె పొట్టేలో, లేకపోతే ఓ మద్యం బాటిల్ తగలొచ్చంటున్నాడు. అలాగని అడిగిన అన్ని టికెట్లు ఇవ్వలేమంటున్నాడు. ప్రతి వ్యక్తికి ఐదు టికెట్లకు మించి కేటాయించేది లేదని తెగేసి చెబుతున్నాడు. ఈ లాటరీలో మొదటి బహుమతిగా గొర్రె పొట్టేలు, రెండవ బహుమతిగా మేక పొట్టేలు, మూడవ బహుమతిగా 100 పేపర్స్ బాటిల్, నాలుగవ బహుమతిగా కోడిపుంజు, ఐదవ బహుమతిగా నాటుకోడి ఉంటాయని ప్రకటించాడు. దీంతో ఫాస్ట్ ఫుడ్ తినేందుకు వచ్చేవారు అప్పుడే లొట్టలేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టికెట్ల కొనుగోలు కోసం క్యూ కడుతున్నారు. ఈ వెరైటీ లాటరీ ద్వారా సదరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు గిరాకీ పెరగడంతో పాటు, విపరీతమైన ప్రచారమూ వచ్చేస్తోంది. ఇక లాటరీ వ్యాపారం లాభసాటి గానే మారనుందట.