GO 46
విధాత: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేవలం తుది ఫలితాలు మాత్రమే వెలువడాల్సి ఉంది. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అయితే జీవో నెం 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ… కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు.
ర్యాలీగావచ్చిన అభ్యర్థులు ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. 2018 నోటిఫికేషన్ ఆధారంగా నియమాకాలు చేపడితే అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల అభ్యర్థులకు సమన్యాయం జరుగుతుందని భావించి… ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లో జీవో 46ను ప్రవేశపెట్టిందన్నారు.
ఈ జీవో వల్ల 33 జిల్లాలకు న్యాయపరమైన రేషియో జరుగుతుందని… ఉత్తర తెలంగాణకు 100 శాతం, దక్షిణ తెలంగాణకు 100 శాతం ప్రకారం రేషియో ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ప్రతీ ఒక్క అభ్యర్థికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొంత మంది కానిస్టేబుల్ అభ్యర్థులు… జీవో 46 ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను రద్దు చేయాలని కొన్ని రోజులుగా కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
జీవో 46ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ ధర్నాలో కానిస్టేబుల్ అభ్యర్థులు రమేష్, శరత్, భాను నాయక్, సతీష్, సురేష్, రఘు, నగేష్ పాల్గొన్నారు.