Runamafi ఎన్నికల తరుణంలో బీఆరెస్లో గుబులు విధాత: రైతు రుణాల మాఫీ హామీ అమలు చట్రంలో ఇరుక్కున్న బీఆరెస్ సర్కార్ నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరవుతుంది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామన్న బీఆరెస్ ఎన్నికల హామీ మళ్లీ ఎన్నికలు వస్తున్నప్పటికి అమలు చేయలేకపోవడంతో రైతుల్లో ఆ పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేస్తుంది. గత రెండు పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల సంందర్భంగా దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్లు, ఉచిత ఎరువులు, కేజీ టూ […]
Runamafi
విధాత: రైతు రుణాల మాఫీ హామీ అమలు చట్రంలో ఇరుక్కున్న బీఆరెస్ సర్కార్ నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరవుతుంది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామన్న బీఆరెస్ ఎన్నికల హామీ మళ్లీ ఎన్నికలు వస్తున్నప్పటికి అమలు చేయలేకపోవడంతో రైతుల్లో ఆ పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేస్తుంది. గత రెండు పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల సంందర్భంగా దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్లు, ఉచిత ఎరువులు, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి ఎన్నికల హామీల జాబితాలోనే రైతు రుణమాఫీ కూడా చేరిపోతుందేమోనన్న సందేహాలు రైతుల నుండి వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం రైతుబంధు, రైతు బీమా ,ఉచిత విద్యుత్తు ఇస్తున్నామంటూ, రికార్డు స్థాయిలో జరిగిన దాన్యం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని. సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచామంటూ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికి రైతుల లక్ష రుణమాఫీ వద్దకు వచ్చే సరికి కప్పదాట్లు వేస్తుంది. రుణమాఫీ ఆలస్యం అవుతున్నకొద్దీ ప్రభుత్వానికి మరింత ఆర్ధిక భారం పెరిగిపోతున్నప్పటికి ఏకకాలంలో లక్ష రుణమాఫీ దిశగా స్పష్టమైన నిర్ణయం మాత్రం తీసుకోలేకపోతుంది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు అర్హులైన రైతులందరికీ లక్ష రుణమాఫీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఈ దిశగా నిధుల సమీకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. విడతలవారీగా మాఫీలో భాగంగా 25 వేల లోపు రైతు రుణమాఫీ మొదట చేపట్టింది. ఇప్పటిదాకా 5,42,635 మందికి రైతులకు 1207.37 కోట్ల రుణమాఫీ చేసింది. మరో 20,351 యొక్క కోట్ల మేరకు రుణమాఫీ చేయాల్సి ఉంది. 2023 -24 బడ్జెట్లో 6,385 కోట్లు కేటాయించినా వాటిని విడుదల చేయలేదు.
దీంతో మిగిలివున్న ఉన్న 20,351కోట్ల రుణమాఫీ ఎట్లా పూర్తి చేస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే ధరణితో, ధాన్యం కొనుగోలు సమస్యలతో, 24 గంటలు ఉచిత విద్యుత్తు 12గంటలకే పరిమితం కావడంతో రైతాంగం నుండి నెలకొన్న ప్రతికూలత నుండి బయటపడడానికి బిఆరెస్ కు రుణమాఫీ సాధనంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ, ఉచిత ఎరువులపై, పెండింగ్ ప్రాజెక్టులపైన బీఆరెస్ ఇచ్చిన హామీలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీని ఇరుకున పడేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీపై ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి బీఆరెస్కు అనివార్యతగా మారింది.
రైతుబంధు రుణమాఫీకే జమ
ప్రభుత్వం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ9(ఎస్ఎల్బీసీ)కి నిర్దిష్టంగా రైతుబంధు సొమ్మును రైతుల రుణ బకాయిల కింద జమ చేయవద్దని చెబుతున్నప్పటికీ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. రైతుబంధు సొమ్మును రైతు రుణాల ఖాతాలో జమ చేస్తూ రైతుబంధు ప్రయోజనం దక్కకుండా చేస్తున్నారు. దీంతో రైతుబంధు పథకం లక్ష్యం నెరవేరకుండా పోతుంది. బ్యాంకర్ల తీరుతో రైతుల్లో నెలకొన్న అసంతృప్తి కాస్తా అటు ఇటు తిరిగి ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుంది.
ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీ చేయనందునే తమ రైతుబంధు సొమ్మును బ్యాంకర్లు రుణ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని, ఈ చర్యతో ప్రభుత్వం ఒక చేత్తో పైసలు ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నట్లు ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు సందర్భంగా కోతలు, తరుగు పేరుతో ఎకరాకు రైతుబంధుకు ఇచ్చే 5,000 మేరకు నష్టం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేయకపోవడం తమను మరింత ఇబ్బంది పెడుతుందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.