హర్యానాలోని హిస్సార్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ విజయేంద్ర సింగ్ ఆ పార్టికి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు
గురుగ్రామ్ : హర్యానాలోని హిస్సార్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ విజయేంద్ర సింగ్ ఆ పార్టికి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. బిజయేంద్ర సింగ్ తండ్రి, మాజీ కేంద్రమంత్రి వీరేంద్ర సింగ్ కూడా తన కొడుకు దారి లోనే, తానూ కాంగ్రెస్లో చేరనున్నట్లు ఆదివారం మీడియాకు తెలియజేశారు.
ఇదిలా వుండగా.. బిజయేంద్ర సింగ్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, బీజేపీ విధానాలపై తనకు కొన్ని స్పష్టమైన వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. పార్టీ అభిప్రాయాలకు భిన్నంగా, వ్యక్తిగత అభిప్రాయాలు కలిగి ఉండటమే తప్పుగా భావించిన బీజేపీ.. తనను విడిగా టార్గెట్ చేస్తున్నదని పేర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా బీజేపీలో ఉండటం చాలా అసౌకర్యంగాను, అభద్రతగానూ భావించానని తెలిపారు. రైతుల ఆందోళనలను ప్రస్తావించి బిజయేంద్రసింగ్.. ప్రాణాలకు తెగించి రోజుల తరబడి పోరాడుతున్నా.. కనీస మద్దతు ధరపై వారికి హామీ ఇవ్వకపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని తెలిపారు. బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపథ్.. సైన్యంలో భర్తీ ప్రక్రియను మరింత గందరగోళానికి గురి చేస్తున్నదని విమర్శించారు.
మహిళా రెజ్లర్లు.. తమపై జరిగిన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేసినా పట్టించుకోని బీజేపీ వైఖరి తనలో ఆ పార్టీపై విశ్వాసం కోల్పోయేలా చేసిందని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి అయిన బిజయేంద్ర సింగ్ 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి హిస్సార్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీజేపీకి రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వీడియోను తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.