ఎవరిని కాపాడాలని ప్రయత్నాలు? ప్రీతి మరణంపై న్యాయ విచారణ జరపాలి ఏఐసీసీ ఆదివాసీ చైర్మన్ బెల్లయ్య నాయక్ బండి కుమారుడు ర్యాగింగ్ చేసినప్పడు చర్యలేవి? ప్రభుత్వానికి ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం ప్రశ్న విధాత: మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ ఆత్మహత్య చేసుకుందని మంత్రి కేటీఆర్ ఎలా చెపుతారని ఏఐసీసీ ఆదివాసీ చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ఎవరిని కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్లో ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతంతో […]
విధాత: మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ ఆత్మహత్య చేసుకుందని మంత్రి కేటీఆర్ ఎలా చెపుతారని ఏఐసీసీ ఆదివాసీ చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ఎవరిని కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్లో ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బెల్లయ్యనాయక్ మాట్లాడుతూ ప్రీతి సంఘటనపై జుడిషియల్ విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.
ఈ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో సర్కారు సమాధానం చెప్పాలన్నారు. ప్రీతి కేసులో ప్రభుత్వం వాస్తవాలు దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రీతి ది ఆత్మహత్య కాదు .. హత్యనే అని బెల్లయ్య నాయక్ అన్నారు. ప్రీతి నాయక్ వేధింపుల ఫిర్యాదులపై తీసుకున్న చర్య లు ఏమీలేవన్నారు. వేధింపులు భరించలేకనే ప్రీతి చనిపోయిందన్నారు.
ప్రీతి మరణాన్ని కూడా రాజకీయం చేసేందుకు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నం చేశారని బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. ప్రీతి మృతికి మతం రంగు పులిమే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని బెల్లయ్య నాయక్ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం లేదని, పైగా నేరగాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వానికి లిక్కర్ ఆదాయమే ముఖ్యమని ఎద్దేవా చేశారు. లిక్కర్, డ్రగ్స్ వల్ల యువత చెడిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు.
కుక్కకు ఉన్న విలువ గిరిజన విద్యార్థినికి లేదా?
ప్రగతి భవన్లో కుక్క చనిపోతే అధికారులపై చర్యలు తీసుకున్న కేసీఆర్.. మెడికో విద్యార్థిని ప్రీతి చనిపోతే ఒక్కరిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం ప్రశ్నించారు. కుక్కకు ఉన్న విలువ కూడా గిరిజన విద్యార్థినికి లేదా? అని అన్నారు. బీఆర్ ఎస్ సర్కార్ శవాల మీద పేలాలు ఏరుకునేలా ప్రవర్తిస్తోందన్నారు.
ప్రీతి చనిపోయాక ట్రీట్ మెంట్ ఇచ్చినట్లుగా నాటకాలు ఆడారన్నారు. ప్రీతిది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రీతికి ఇచ్చిన ట్రీట్మెంట్పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు గతంలో ర్యాగింగ్ చేసినా చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఇప్పడు అదే బండి సంజయ్ ప్రీతి సంఘటనకు మతం రంగు పులిమే ప్రయత్నం చేశారని ప్రీతం ఆరోపించారు.