తమకు, హమాస్కు మధ్య జరుగుతున్న యుద్ధంలోకి హిజ్బొల్లా సంస్థ ప్రవేశిస్తే.. అది ఆ సంస్థకు, లెబనాన్కు ఊహించలేని విధ్వంసాన్ని మిగుల్చుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి హెచ్చరించారు
జరూసలేం: తమకు, హమాస్కు మధ్య జరుగుతున్న యుద్ధంలోకి హిజ్బొల్లా సంస్థ ప్రవేశిస్తే.. అది ఆ సంస్థకు, లెబనాన్కు ఊహించలేని విధ్వంసాన్ని మిగుల్చుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. లెబనాన్ను ప్రాంతీయ యుద్ధంలోకి లాగేందుకు హిజ్బొల్లా ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. గాజాపై తాము విజయమో వీర స్వర్గమో తేల్చుకునేందుకు యుద్ధం చేస్తున్నామని అన్నారు. లెబనాన్ నుంచి తమ దేశంపైకి యుద్దట్యాంకుల విధ్వంసక క్షిపణులను ప్రయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. లెబనాన్ నుంచి ఒక డ్రోన్ను తాము నేలకూల్చామని తెలిపింది.
హిజ్బొల్లా గ్రూపు అత్యంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నదని ఇజ్రాయెల్ మిలిటరీ ఆరోపించింది. హిజ్బొల్లా యుద్ధంలోకి దిగితే.. సాధించేది ఏమీ ఉండదని, పైగా చాలా నష్టపోతుందని హెచ్చరించింది. లెబనాన్ నుంచి క్షిపణులు పడుతున్న నేపథ్యంలో ఆ దేశానికి సరిహద్దులో ఉన్న పట్టణాల నుంచి దాదాపు 60 వేల మందిని ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. మరోవైపు వేల సంఖ్యలో దళాలను ఏ నిమిషమైనా లోనికి పంపేలా గాజా సరిహద్దుల వద్ద మోహరించింది. రాత్రిపూట సైతం గాజాపై బాంబులు కురిపిస్తున్నది.