Congress
- కాంగ్రెస్లోకి మాజీ మంత్రి మహేందర్రెడ్డి!
- ఈ నెల 16 తరువాత ముహూర్తం?
- గత కొంత కాలంగా అసంతృప్తిలో…
- బీజేపీ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా!
విధాత: శ్రావణ మాసం కాంగ్రెస్ పార్టీకి కలిసి రానున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరుదామని నిర్ణయించుకున్న నేతలు, అవకాశాల కోసం పార్టీ మారుదామనుకున్న నేతలు అధిక మాసం కావడంతో ఆగిపోయారని అంటున్నారు. ఈ నెల 16వ తేదీన అధికమాసం వెళ్లి పోతుందని, శ్రావణ మాసం మంచి రోజులు వస్తుండటంతో నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పటికే కొంత మంది బీఆరెస్కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది.
ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కొంత మంది కాంగ్రెస్ జెండా కప్పుకోవడానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆరెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు కొంత మంది తమకు టికెట్ ఇచ్చే అవకాశం లేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలన్న అభిప్రాయాన్ని తమ అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నారని సమాచారం. గత కొంత కాలంగా బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ కొంత కాలంగా కావాలనే తనను దూరం పెట్టారని సన్నిహితుల వద్ద ఆయన అన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా మంత్రి కేటీఆర్.. మహేందర్రెడ్డిని తీసుకు వెళ్లి కలిపించినప్పడు సీఎం కేసీఆర్ పెద్దగా స్పందించలేదని, దూరం పెట్టే ప్రయత్నం చేశారన్నరన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాలలో జరుగుతోంది. దీంతో ఇక్కడ ఉండి లాభం లేదన్న నిర్ణయానికి మహేందర్రెడ్డి వచ్చారని ఆయన అనుచరులు అంటున్నారు.
అన్నీ అనుకూలంగా ఉంటే అధిక మాసం వెళ్లగానే శ్రావణ మాసం తొలి రోజుల్లోనే కాంగ్రెస్ జెండా కప్పుకుందామని అత్యంత సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ నెల 18వ తేదీ మంచి ముహూర్తం కూడా ఉందని చర్చించుకున్నట్లు తెలిసింది. మహేందర్రెడ్డి కాంగ్రెస్లో చేరితే జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుయాయులు కూడా ఆయన వెంటే నడుస్తారన్న చర్చ జరుగుతున్నది.
బీజేపీ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా!
బీజేపీకి చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్లో ఈ నెలలోనే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. కాగా బీఆరెస్ ఈ నెలాఖరు వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే సెప్టెంబర్లో చాలా మంది బీఆరెస్ను వీడి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు అన్నారు.
విధాత : Vidhaatha Telugu News Paper | Vidhatha ePaper | epaer vidhaatha