Jagityala తెలంగాణ అభివృద్ధి.. మద్యం రంగంలో అభివృద్ధే స్థానిక ఉద్యోగాలు ఆంధ్రులు కొల్లగొడుతున్నారు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మరో ఉద్యమం తప్పదు అది జగిత్యాల నుండే ప్రారంభం కావాలి.. ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విధాత బ్యూరో, కరీంనగర్: నీళ్లు నిధులు నియామకాల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు అప్పుల కుప్పగా మారిందని శాసనమండలి సభ్యుడు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జగిత్యాల ఇందిరా […]
Jagityala
విధాత బ్యూరో, కరీంనగర్: నీళ్లు నిధులు నియామకాల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు అప్పుల కుప్పగా మారిందని శాసనమండలి సభ్యుడు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జగిత్యాల ఇందిరా భవన్ లో జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించే నాటికి 60 వేల కోట్ల అప్పు ఉన్న తెలంగాణ, ప్రస్తుతం లక్ష 50 వేల కోట్ల అప్పుల్లోకి చేరుకుందన్నారు. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డ 1,50,000 అప్పుతో పుడుతున్నాడని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు, చివరకు ఔటర్ రింగ్ రోడ్డు ను కూడా ప్రభుత్వం అమ్మకానికి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది అని అన్నారు.
రాష్ట్రం ఏర్పాటు సమయంలో 97 వేల ఉద్యోగాల ఖాళీలు ఉండగా, ప్రస్తుతం ఆసంఖ్య లక్షా 90 వేలకు చేరుకుందన్నారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి సంవత్సర కాలంలో 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా, నేటికీ కనీసం 8 ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారని ఆరోపించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అవినీతికి నిలయంగా మార్చి, బజారులో నిలబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానికులకు ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ ఉంటే, తెలంగాణలో ఉద్యోగాలను మాత్రం ఆంధ్ర వాళ్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే తెలంగాణ ఉద్యమ లక్ష్యం నీరు కారిపోతుందన్నారు.
దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి జరిగిందని అధికార నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, వాస్తవానికి కెసిఆర్ దశాబ్ది పాలనలో, శతాబ్ది కాలం తెలంగాణ వెనక్కు పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 9వేల కోట్లు ఉండే మద్యం ఆదాయం ప్రస్తుతం 26 వేల కోట్లకు చేరుకుందన్నారు.
దశాబ్ది కాలంలో తెలంగాణ అభివృద్ధి అంటే అది మద్యం అభివృద్ధి రంగంలోనే అంటూ ఎత్తిపొడిచారు.
అభివృద్ధి తెలంగాణ కావాలంటే మలిదశ తెలంగాణ ఉద్యమం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, దానికి జగిత్యాలలోనే బీజం పడుతుందని చెప్పారు.