జర్నలిజాన్ని రక్షించాలని వినతి పత్రం అందజేసిన టీయూడబ్ల్యుజే విధాత: వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు (Journalists) నిద్రాహారాలు మాని శ్రమిస్తుంటారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Governor Tamilisai Soundar Rajan)అన్నారు. జర్నలిస్టులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘సేవ్ జర్నలిజం’ పేరుతో దేశవ్యాప్తంగా జర్నలిస్ట్లు చేపట్టిన ఆందోళనలో భాగంగా గురువారం టీయూడబ్ల్యుజే(TUWJ) హైదరాబాద్లోని కవాడిగూడలో సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)(PIB) తెలంగాణ […]
విధాత: వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు (Journalists) నిద్రాహారాలు మాని శ్రమిస్తుంటారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Governor Tamilisai Soundar Rajan)అన్నారు. జర్నలిస్టులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘సేవ్ జర్నలిజం’ పేరుతో దేశవ్యాప్తంగా జర్నలిస్ట్లు చేపట్టిన ఆందోళనలో భాగంగా గురువారం టీయూడబ్ల్యుజే(TUWJ) హైదరాబాద్లోని కవాడిగూడలో సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)(PIB) తెలంగాణ రీజియన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది.
అనంతరం పీఐబీ జాయింట్ డైరెక్టర్ వి.బాలకృష్ణకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రతినిధి బృందం అందించింది. అనంతరం ప్రతినిధి బృందం రాజ్ భవన్లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది.
ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి మీడియా స్థితిగతులను, జర్నలిస్టుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పాలకుల ఇష్టాయిష్టాలకు లొంగని జర్నలిస్టులు, మీడియా సంస్థల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కక్ష్యసాధింపు ధోరణులు సరైంది కాదన్నారు. బడా కార్పోరేట్ సంస్థల ఆధిపత్యం నుండి మీడియాను తప్పించాలని కోరారు. సంపాదకుల, స్వతంత్ర జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడాలన్నారు.
జర్నలిస్టులపై క్రూరమైన చట్టాల ప్రయోగాన్ని వెంటనే నిలిపివేయలన్నారు. ఐటీ నిబంధనల ముసుగులో డిజిటల్ మీడియాకు సమస్యలు సృష్టించడం సరైంది కాదన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా జర్నలిస్టులు సాధించుకున్న రైల్వే ప్రయాణాల్లో రాయితీ లాంటి సౌకర్యాలను పునరుద్ధరించాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై దాడులను అరికట్టి, అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. జర్నలిస్టుల భద్రతకు కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని గవర్నర్ను కోరారు.
గవర్నర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో టీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, టీయుడబ్ల్యుజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, కోశాధికారి కే. మహిపాల్ రెడ్డి, హెచ్యూజే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, అబ్దుల్ హమీద్ షౌకత్ తదితరులున్నారు.