భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ.. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపు అంశంపై వినతి సానుకూలంగా స్పందించిన మంత్రి విధాత: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy ) గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునీకరించాలని కోరారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలో మీటర్ల దూరంలో […]
విధాత: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy ) గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునీకరించాలని కోరారు.
యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలో మీటర్ల దూరంలో భువనగిరి రైల్వే స్టేషన్ ఉందని, యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి పొందడంతో ప్రతి రోజు దేశవ్యాప్తంగా వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారని కేంద్ర మంత్రి కి వివరించారు. అలాగే భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు.
జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడిందని, ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారని, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి కి వివరించారు. ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ను వెంకట్ రెడ్డి కోరారు.
రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపుపై కూడా వెంకటరెడ్డి మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఎంఎంటీఎస్ ను ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం ఉందని, ఎంఎటీఎస్ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదని, కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండానే వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. వెంకట్ రెడ్డి తన దృష్టికి తెచ్చిన సమస్యలపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.
ఘట్ కేసర్ నుండి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులను కేంద్ర నిధులతోనే ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా వెంకట్ రెడ్డి తెలిపారు.