రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు క్రిష్ పేరును కూడా నమోదు చేశారు
విధాత : రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు క్రిష్ పేరును కూడా నమోదు చేశారు. విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా, తాను ముంబైలో ఉన్నానని సోమవారం విచారణకు వస్తారని తెలిపారు. ఈ లోగానే క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
విదేశాలకు పారిపోయిన నీల్
రాడిసన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. నిందితుల్లో ఒకడైన నీల్(ఏ9) విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు నిందితుడు రఘు చరణ్కు నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ శుక్రవారం వచ్చే అవకాశం అవకాశముందని పోలీసులు తెలిపారు.
లిషిత కనిపించడం లేదంటూ సోదరి ఫిర్యాదు
మరోవైపు ఈ కేసులో నిందితురాలిగా ఉన్నసినీ నటి, యూట్యూబర్ లిషిత కనిపించడంలేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ మొదలైనప్పటి నుంచి లిషిత పరారీలో ఉండగా, మూడు రోజుల క్రితం ఆమె ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఈ నోటీసులకు లిషిత సోదరి కుషిత పోలీస్ స్టేషన్కు వచ్చి సమాధానం ఇచ్చారు. ఆమె ఇంట్లో లేదని వచ్చాక విచారణకు పంపిస్తామని తెలిపారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు లిషిత ఖచ్చితంగా రావాలని ఆమె సోదరికి పోలీసులు స్పష్టం చేశారు.
ఇక గజ్జల వివేకానంద డ్రగ్ పార్టీల వివరాల కోసం పోలీసులు అతడి వాట్సాప్ చాటింగ్స్, గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఈ కేసులో వివేకానంద స్నేహితులు, సహ నిందితులు దర్శకుడు క్రిష్, సెలగంసెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘు చరణ్, సందీప్, శ్వేత, లిషిత, నీల్ సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నీల్ విదేశాలకు పారిపోగా, పరారీలో ఉన్న సందీప్, శ్వేత, యూట్యూబర్ లిషిత తదితరుల ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితుల ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది.
అటు రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీకి సంబంధించి సాక్ష్యాధారాల సేకరణ పోలీసులకు సవాల్గా తయారైంది. ఈ స్టార్ హోటల్లో మొత్తం 209 సీసీ కెమెరాలు ఉన్నా.. డ్రగ్స్ పార్టీ జరిగిన రూమ్ వైపు సీసీ కెమెరాలు పనిచేయలేదని తెలుస్తుంది. అదే నిజమైతే డ్రగ్స్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారన్న వివరాల సేకరణ పోలీసులకు కష్టతరం కానుంది.
కీలకంగా మారిన డ్రగ్ పెడ్లర్లు అబ్బాస్, వహిద్ల స్టేట్మెంట్
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్లు అబ్బాస్, మీర్చా వహిద్లు ఇచ్చిన వాంగ్మూలం కేసు విచారణలో కీలకంగా మారింది. అబ్బాస్ తన వాంగ్మూలంలో మీర్జా వహీద్ వద్ద తను తరుచుగా కొకైన్ కొనుగోలు చేస్తూ ప్రధాన నిందితుడు గజ్జల వివేకానందకు సరఫరా చేశాడు. వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అబ్బాస్ అందించేవాడు. గ్రామ్ కొకైన్ను మీర్జా వహీద్ వద్ద అబ్బాస్ రూ.14వేలకు కొనుగోలు చేసి గజ్జల వివేకానందకు విక్రయించేవాడు.
కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమీషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్కు గజ్జల వివేకానంద అలవాటుపడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈనెల 16, 18, 19, 24న సైతం గజ్జల వివేకానందకు అబ్బాస్ కొకైన్ ఇచ్చినట్టు పోలీసులకు తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇక మీర్జా వహిద్ సైతం తనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో పోలీసులకు వెల్లడించాడు. దీంతో అతడిచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురు డ్రగ్ పెడ్లర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.