Manipur విధాత: ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న విధ్వంస, మారణహోమం ఆ రాష్ట్రానికి ఎంతోదూరంలో ఉన్నవారిని సైతం ఆలోచింప జేస్తున్నది. విభజించి పాలించాలనే బ్రిటషర్ల ఆలోచనా ధోరణి ఈ పరిణామాల వెనుక కనిపిస్తున్నది. మణిపూర్ నుంచి ప్రతి రోజూ వచ్చే దృశ్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ పరిణామాలు, అక్కడి హింస మణిపూర్కే పరిమితమని భావించే పరిస్థితి కనిపించడం లేదు. అవి అన్ని రాష్ట్రాలకూ విస్తరించే పరిస్థితి లేకపోలేదు. అక్కడి పరిణామాలు జాతిని నివ్వెర పరుస్తున్నాయి. […]
Manipur
విధాత: ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న విధ్వంస, మారణహోమం ఆ రాష్ట్రానికి ఎంతోదూరంలో ఉన్నవారిని సైతం ఆలోచింప జేస్తున్నది. విభజించి పాలించాలనే బ్రిటషర్ల ఆలోచనా ధోరణి ఈ పరిణామాల వెనుక కనిపిస్తున్నది. మణిపూర్ నుంచి ప్రతి రోజూ వచ్చే దృశ్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
ఈ పరిణామాలు, అక్కడి హింస మణిపూర్కే పరిమితమని భావించే పరిస్థితి కనిపించడం లేదు. అవి అన్ని రాష్ట్రాలకూ విస్తరించే పరిస్థితి లేకపోలేదు. అక్కడి పరిణామాలు జాతిని నివ్వెర పరుస్తున్నాయి. మణిపూర్లో పరిస్థితిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని హోం మంత్రి అమిత్షా నిర్వహించారు.
కానీ.. నిజానికి దేశంలో ఒక రాష్ట్రం మండిపోతుంటే ప్రధాని ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉండె. కానీ.. ప్రధానికి దేశంలో విషయాల కంటే విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆయన ఈ విషయంలో మౌనం వహించినట్టే భావించాలి. ఇది ప్రజల్లో అపనమ్మకం కలిగించే చర్యగానే భావించాలి. కనీసం విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన తర్వాతనైనా ప్రధాని మణిపూర్పై ధ్యాస పెడితే ఆ రాష్ట్ర ప్రజలకు కొంతైనా విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి విభిన్న సంస్కృతులు, అనేక తెగలు కలిసి, తమ గుర్తింపును కాపాడుకుంటూనే కొన్ని తరాలుగా శాంతియుత సహజీవనం చేసిన గొప్పతనం మణిపూర్ సొంతం. 1940లలో కూడా మణిపూర్లో ఈ సౌభ్రాతృత్వాన్ని చెదరగొట్టే ప్రయత్నాలు జరిగినా.. మణిపూర్ దానిని నిలువరించింది.
కానీ.. మణిపూర్లో నిరాటంకంగా కొనసాగుతున్న హింస, దానిపై కేంద్ర పాలకులు ఉదాశీనత గమనిస్తే.. రాబోయే ఎన్నికలలోపు మరిన్ని రాష్ట్రాల్లో ఈ తరహా విద్వేషాలు చొరబడే అవకాశాలను కొట్టిపారేయలేం.
మణిపూర్ ఒక్కటే కాదు.. ఈశాన్యా రాష్ట్రాలన్నీ వేర్పాటువాద ఉద్యమాలతో, జాతిపరమైన ఘర్షణలతో అశాంతిని అనుభవిస్తున్నవే. కేంద్ర పాలకులతో ఇక్కడి సంస్థలు ఘర్షణపూరిత వైఖరితో ఉన్నవే.
మణిపూర్లో సుమారు 39 తెగలు ఉన్నాయి. వీటిలో కొన్ని హిందూయిజాన్ని అనుసరిస్తే.. మరికొన్ని ఇస్లాం, క్రైస్తవ మతాలను ఆరాధిస్తుంటాయి. ఇక్కడ చెలరేగే ఘర్షణల నివారణ పేరుతో కేంద్ర ప్రభుత్వాలు సాయుధ దళాలకు విచక్షణాధికారాలు కల్పించాయి.
ఆ కోవలో తెచ్చిందే ఆర్మ్డ్ ఫోర్సెస్ (ప్రత్యేకాధికారాలు) చట్టం. ఎన్నికలు వచ్చే సమయానికి కేంద్ర పాలకులు హామీలతో స్థానిక తెగలను మభ్యపెడుతుంటారు. వైరి వర్గాలకంటే మించిన అధికారం కల్పిస్తామని ఆశపెడుతుంటారు.
తమ మద్దతు కావాలంటే తమ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిని ఒక సాయుధ గ్రూపు డిమాండ్ చేసినట్టు 2019లో సామాజిక మాధ్యమాల్లో ఒక లేఖ చక్కర్లు కొట్టింది. తర్వాత ఆ సంస్థ దానిని ఖండించినా.. 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా రెండు కుకి సాయుధ గ్రూపులు ప్రకటనలు ఇచ్చాయి.
మరోవైపు హిందూ మెజారిటీ తెగ మెయితీ.. తమను ఎస్టీ క్యాటగిరీలో చేర్చాలని డిమాండ్ చేసింది. రిజర్వేషన్లలో వారికి వాటా దక్కితే తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని కొండ ప్రాంతాల్లో నివసించే వారు ఆందోళన చెందారు. అయితే ఎన్నికల అనంతరం మెయితీ తెగలను ఎస్టీల్లోకి చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా బెడిసికొట్టింది.
ఫలితంగా 50 రోజులుగా మణిపూర్ మంటల్లో ఉన్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మీడియా కానీ ఇది మెల్లగా సద్దుమణిగిపోతుందనే అభిప్రాయంతోనే ఉండటం విచారకరం. నిజానికి ఘర్షణలు మొదలైన తర్వాత వాటి తీవ్రతను అంచనా వేయడంలో కేంద్రం, మీడియా సంస్థలు విఫలమయ్యాయి. విశేషం ఏమిటంటే.. డబులింజన్ అని చెప్పకొంటున్న రాష్ట్రంలో.. ఒక ఇంజిన్.. విదేశీ పర్యటనలు చేస్తుంటే.. మరో ఇంజిన్ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. సెభాష్ డబుల్ ఇంజిన్!
ప్రధాన మంత్రిని కలుసుకునేందుకు 9 మంది మెయితీ ఎమ్మెల్యేల బృందం ప్రయత్నించిన దన్న వార్త.. ప్రధాని విదేశీ పర్యటనల ఢంకా బాజా వార్తల నడుమ కనిపించకుండా కొట్టుకుపోవడం కొసమెరుపు.