Minister Jagdish Reddy కాంగ్రెస్ నేతల విమర్శలపై మంత్రి జగదీష్ రెడ్డి రివర్స్ అటాక్ విధాత: రాష్ట్ర ప్రజల వెనుకబాటుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగు, తాగునీటి కష్టాలకు ఫ్లోరైడ్ శాపాలతో పాటు సర్వపాపాలకు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణమని, ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీనే తప్ప సీఎం కేసీఆర్ కాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు పూర్తి చేయనందుకు సీఎం కేసీఆర్ […]
Minister Jagdish Reddy
విధాత: రాష్ట్ర ప్రజల వెనుకబాటుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగు, తాగునీటి కష్టాలకు ఫ్లోరైడ్ శాపాలతో పాటు సర్వపాపాలకు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణమని, ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీనే తప్ప సీఎం కేసీఆర్ కాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు పూర్తి చేయనందుకు సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన డిమాండ్ పైన, కే. జానారెడ్డి, ఎన్. ఉత్తంకుమార్ రెడ్డిలు చేసిన విమర్శలపైన మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పైన, తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పైన తాము చర్చకు సిద్ధమని, చర్చను జానారెడ్డి నియోజకవర్గంలోని సాగర్ ప్రాజెక్టు రాజవరం మేజర్ వద్ద పెడదామా లేక ఉత్తంకుమార్ రెడ్డి జాన్ పహాడ్ వద్ద పెడదామా అంటూ జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలతోపాటు జిల్లా వాసులు ఎదుర్కొంటున్న కష్టాలకు కాంగ్రెస్ నేతలు నేటికీ మోస్తున్న వైఎస్సార్ పాలన, ఆ పార్టీకి మిత్రపక్షంగా మారిన టిడిపి చంద్రబాబు పాలనలే కారణమన్నారు.
సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్లను సీమాంధ్ర పాలకులు తరలించుకపోతుంటే పదవుల కోసం పెదవులు తెరవక..ఢిల్లీ బాస్ లకు గులాంలుగా మారి జిల్లాను ఏడారి గా మార్చిన కాంగ్రెస్ నాయకులు జిల్లా ప్రజలకు ఒక్కసారి కాదని లక్ష సార్లు క్షమాపణ చెప్పాలని, వేయిసార్లు ఢిల్లీ దాకా ముక్కు నేలకు రాయాలని జిల్లా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానన్నారు.
విద్యుత్ రంగంపై విమర్శలు చేస్తున్న భట్టి ఏ విద్యుత్ సబ్స్టేషన్ వద్దనైనా చర్చకు రావచ్చన్నారు. కాంగ్రెస్ పాలనలో తప్పులు, వైఫల్యాలు మరిచి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న భట్టి వైఖరి గురివింద గింజ సామెతలా ఉందన్నారు. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం టిబీఎం మిషన్ల ఎంపికలో చేసిన తప్పిదం, సాంకేతిక కారణాలు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ షరతుల నేపథ్యంలోనే ఆలస్యం అవుతుందన్నారు.
అందుకు ఆనాటి కాంగ్రెస్ పాలకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులే బాధ్యులవుతారన్నారు. కాంగ్రెస్, టిడిపిలో పాలనలో రాష్ట్రంలో రైతులు విత్తనాలు, ఎరువులకు క్యులు కట్టేవారని, మహిళలు బిందెలతో మంచినీటి కోసం బారులు తీరే వారన్నారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయేవని, సాగర్ కాలువలకు ఒక పంటకే నీరు అందేదని, సీఎం కేసీఆర్ పాలనలో అలాంటి కష్టాలేవి లేవన్నారు. సాగర్ ఆయకట్టలో వరసగా 16వసారి రెండో పంట సాగు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఒక కోటి పది లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే నేడు రెండు కోట్లకు పెరిగిందన్నారు. 68 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి ఉంటే నేడు 2.60 లక్షల కోట్ల టన్నులకు పంట దిగుబడి పెరిగిందన్నారు.
నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల టన్నుల నుండి 40 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. మరి కాంగ్రెస్ పాలనలో అవన్నీ ఎందుకు సాధించలేకపోయారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు లేవో చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు కాంగ్రెస్ నేతలు లక్ష సార్లు ప్రజల క్షమాపణ చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ఇవ్వలేని ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు కేసిఆర్ కు క్షమాపణ చెప్పాలా, లేక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం వంటి పథకాలతో సాగు తాగు నీటి కష్టాలు తీర్చినందుకా, రైతుబంధు, రెండు వేల పించన్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తున్నందుకా, కాలేశ్వరం తొలిఫలంతో సూర్యపేట జిల్లాకు గోదావరి నీళ్లు ఇస్తున్నందుకా ఎందుకు క్షమాపణ చెప్పాలంటూ భట్టిని జగదీష్ రెడ్డి నిలదీశారు.
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ నేతలు ఉరుకులు పెడుతున్నారని, వారి తొండ ఉరుకులు ఏనుగు వరకే అన్నారు. కర్ణాటకలో బిజెపి మోడీ ప్రభుత్వం దుర్మార్గాలకు ప్రత్యామ్నాయంగా అక్కడ బిఆర్ఎస్ లేకపోవడంతోనే కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం కాంగ్రెస్ పాలన లోనే ఉందని, ఆనాడు నియామకాల్లో అధిక శాతం సీమాంద్రులు తరలించుకపోతుంటే, మంత్రి పదవుల కోసం జానా, ఉత్తమ్, భట్టిలు నోరుమెదపలేదన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో ఇప్పటికే వేసిన 1లక్ష 30 వేల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే కు దక్కయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం కాంగ్రెస్ నేతలకే ఉందని, వారి పాలనా వైఫల్యాలకు గుణపాఠం చెబుతూ ప్రజలు వారిని నిరుద్యోగులుగా మార్చారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పాలనలో కునారిల్లిన వ్యవసాయం, ఫ్లోరైడ్ తో వంగిపోయిన ప్రజల జీవితాలు సీఎం కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులతో మెరుగయ్యాయన్నారు.
మిషన్ భగీరథ తో ఫ్లోరైడ్ నిర్మూలన జరిగిందని కొత్తగా కేసులు నమోదు కాలేదని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు తమలో తాము రాజకీయ ఆధిపత్యాల కోసం పాదయాత్రలు చేస్తూ రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన పై విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోను మరోసారి కాంగ్రెస్ కు ఆశాభంగం, బిఆర్ఎస్ కు అధికార పీఠం తద్యమన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆర్. రవీంద్ర కుమార్, నోముల భగత్, నల్లమోతు భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.