Minister KTR | తెలంగాణ వ్యవసాయ రంగం.. దేశానికి దిక్సూచి కావాలి: మంత్రి కేటీఆర్
జిల్లెల్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు దేశానికి దిశా నిర్దేశం చేయాలి విధాత బ్యూరో, కరీంనగర్: సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయంను కాళేశ్వరం, సహా అనేక సాగు నీటి ప్రాజెక్టులతో స్వరాష్ట్రంలో పండుగగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో వ్యవసాయ కళాశాలను మంత్రి నిరంజన్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. […]

- జిల్లెల్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు దేశానికి దిశా నిర్దేశం చేయాలి
విధాత బ్యూరో, కరీంనగర్: సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయంను కాళేశ్వరం, సహా అనేక సాగు నీటి ప్రాజెక్టులతో స్వరాష్ట్రంలో పండుగగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో వ్యవసాయ కళాశాలను మంత్రి నిరంజన్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. కళాశాలలో వివిధ విభాగాలు, వాటి పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశానికే దిశానిర్దేశం చేసే వ్యవసాయ శాస్త్రవేత్తలుగా జిల్లెళ్ళ కళాశాలలోనీ విద్యార్థులు తయారు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశదిశ చూపుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ విస్తరణ జరిగిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కొందరు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వారు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమానికి హెలికాప్టర్లో వస్తున్నప్పుడు వరుసగా ఉన్న కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్ మానేరులో నీళ్లు నిండి కళకళలాడుతుంటే ఎంతో సంబురంగా అనిపించిందని హర్షం వ్యక్తం చేశారు.
సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్ లేదన్నారు. తెలంగాణలో కొత్తగా చేపట్టిన రిజర్వాయర్ల ద్వారా భూగర్భ జల మట్టం పెరిగి కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని మంత్రి స్పష్టం చేశారు. కేసిఆర్ అంటే నే రైతు బంధు అని చెప్పిన కేటీఆర్, దండగ అన్న వ్యవసాయం పండుగ చేశారని కొనియాడారు.
సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ కళాశాలతో పాటుగా పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరైందని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా, ఎంటర్ ప్రెన్యూ ర్గా ఎదగాలన్నారు.
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకు సాటి లైట్ క్యాంపస్ మంజూరుతో పాటు వ్యవసాయ కళాశాలను పీజీ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలనీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కోరగా సీఎం కేసీఆర్ అనుమతితో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ కళాశాలగా నామకరణం చేయాలని, కళాశాల ఆవరణలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆయన వ్యవసాయం శాఖ మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.
రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక సదుపాయాలు, అధునాతన సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కళాశాల దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా నిలుస్తుందని అన్నారు. తాను చిన్న, పెద్ద ఎందరో నాయకులను చూశానని తనదైన ప్రత్యేక పనితీరు, డైనమిజంతో ప్రపంచంలోనే పేరుగాంచిన వ్యక్తి మంత్రి కేటీఆర్ అని కొనియాడిన సభాపతి, మేము మా నియోజకవర్గాలలో 47 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కంటే మిన్నగా సిరిసిల్లను ఈ 9 ఎండ్లలో కేటీఆర్ అభివృద్ధి చేశారని ప్రశంసించారు.
ఉబికి వచ్చిన భూగర్భ జలాల లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా నెంబర్ వన్ గా నిలిచి అఖిల భారత సర్వీస్ అధికారులకు పాఠంగా మారడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతనని ఆయన చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో ఇన్ని రిజర్వాయర్లు వస్తాయని ఎవరైనా సమైక్య రాష్ట్రంలో ఊహించారా ? అని సభాపతి ప్రజలను ప్రశ్నించారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యమే కరువు ప్రాంతాలలో ప్రజలకు ఆహారంగా పంపిణీ అవుతుండడం మనందరికీ గర్వకారణం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఒక కోటి 8 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, కేసీఆర్ ప్రత్యేక చొరవతో అది రెండు కోట్ల 30 లక్షల పెరిగిందన్నారు.
అంతేకాకుండా కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ రంగం అంతకంతకు అభివృద్ధి చెందుతూ 10 లక్షల మంది నిరుద్యోగులకు ఐటి రంగంలో ఉపాధి లభించింది అన్నారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర సహా పొరుగున ఉన్న రాష్ట్రాల ప్రజలు కొనియాడుతున్నారని…. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలను ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు మరే రాష్ట్రంలో లేవని సభాపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరానికి మార్గదర్శకత్వం వహిస్తూనే రేపటి తరానికి నాయకత్వం వహించే దక్షత ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని ప్రశంసించారు. ఆధునిక వసతులు ,సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కళాశాల రావడం ఈ ప్రాంత విద్యార్థులకు అదృష్టమని మంత్రి చెప్పారు. సమైక్య రాష్ట్రంలో భూములు కలిగి ఉన్న ప్రజలు సాగు జలాల లభ్యత లేక ధాన్యం గింజల కోసం ప్రభుత్వ రేషన్ కోసం క్యూ లైన్లు లో నిలబడే దుస్థితి ఉండేది అన్నారు.
ఆనాటి పరిస్థితులను చూసి చలించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి రాష్ట్రమును సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. సమైక్య చిధ్రమైన జీవితాలకు సిరిసిల్ల నేలవుగా మారిందని ఇప్పుడు.. డైనమిక్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బంగారు భవిష్యత్తుకు నెలవుగా మారిందని అన్నారు. భూగర్భ జలమట్టం పెరగడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముస్సోలి లోని శిక్షణ ఐఏఎస్ లకు పాఠంగా మారడం గర్వకారణమన్నారు.
సగానికి పైగా జనాభా వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న దేశంలో ప్రభుత్వ ,ప్రైవేటు రంగాలలో కేవలం 700 లోపే వ్యవసాయ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రాధాన్యతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేస్తుందన్నారు.
స్వరాష్ట్రంలో రైతాంగ సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు వివిధ రూపేనా నాలుగు లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు . వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం వినూత్న నిర్ణయాలతో దేశ వ్యవసాయ రంగానికి ఒక కొత్త విప్లవాన్ని తెచ్చిందని ఆయన కొనియాడారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది అన్నారు. దేశం మొత్తంలో 95 లక్షల ఎకరాలలో వరి సాగు అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు అవుతున్న విషయం తెలిపారు. తెలంగాణలో ఏ ఇంట్లో చూసినా సంక్షేమం, ఏ ఊరు చూసినా పచ్చదనం కనిపిస్తుందన్నారు.
భావితరాలకు నీటి మూట సంపదను కేసీఆర్ సృష్టించారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో పోరాటాలకు నెలవుగా మారిన రాజన్న సిరిసిల్ల అభివృద్ధిలో స్వరాష్ట్రం లో నెంబర్వన్ గా నిలిచిందని అన్నారు. జరిగిన పనిని, జరుగుతున్న పనిని మెచ్చుకుంటూ జరగాల్సిన పనిపై సూచనలు చేయాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ 20 ఏళ్ల క్రింద తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకోకపోతే జిల్లాలో ఈ కళాశాల ఉండేదా అని ప్రజలను ప్రశ్నించారు. అసమానతలపై పోరాడిన నేల ,సీఎం కేసీఆర్ చొరవతో స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారిందన్నారు.
అమెరికా స్థాయిలో తెలంగాణలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ అభివృద్ధికి ఊతమిచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే వ్యవసాయ రంగం పరిశ్రమగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. వ్యవసాయంలో రాబోయే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై విద్యార్థులు ఈ కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచి ఆలోచించాలన్నారు.