ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ సీనియర్ నాయకురాలు, మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ సీనియర్ నాయకురాలు, మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, ప్రధాని మోదీకి కేజ్రీవాల్ అంటే భయమని అందుకే ఈడీని రాజకీయ ఆయుధంగా వాడుకొని కేజ్రీవాల్ను తప్పుడు కేసుల్లో ఇరికించిందని ఆరోపించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం మోదీకి కేజ్రీవాల్ అంటే భయం అనే సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని ప్రతి ఇంటికి ఆప్ కార్యకర్త వెళ్లి అక్రమ అరెస్ట్ గురించి వివరించాలని కోరింది. ఆప్ నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా కేజ్రీవాల్ ఫొటోను డీపీగా పెట్టుకొని మద్ధతు తెలపాలని మంత్రి ఆతిశీ పిలుపునిచ్చారు. ఇండియా విత్ కేజ్రీవాల్ అనే సైట్ను ప్రజలంతా డౌన్లోడ్ చేసుకొని ఆప్ చేపట్టిన క్యాంపెయిన్కు మద్ధతుగా, మోదీకి వ్యతిరేకంగా నిలవాలని ఆమె కోరారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నిర్మూలించి వారి భయాన్ని పోగొట్టుకోవాలని చూస్తున్నారని, ఆమె ఆరోపించారు. మీరు కేవలం కేజ్రీవాల్ను మాత్రమే అరెస్ట్ చేయగలరు కానీ ఆయన ఆలోచనని, రాజకీయ ఆదర్శాలను అరెస్టు చేయలేరని మంత్రి వెల్లడించారు. ఆయన అనుచరులు మరింత మంది అతని అడుగు జాడల్లో నడిచి కేజ్రీవాల్ ఆశయాలను ముందుకు తీసుకుపోతారని, ఆ శక్తిని ఆపటం ఎవరికి సాధ్యం కాదని మంత్రి ఆశితీ పేర్కొన్నారు.