ముందస్తు ఖరారుతో పెరుగనున్న ఎన్నికల వ్యయం పోలింగ్కు ఎక్కువ గడువు.. పండుగలతో అదనపు ఖర్చులు ఆర్ధిక వనరుల సమీకరణకు అభ్యర్థుల పాట్లు Telangana | విధాత: అసెంబ్లీ ఎన్నికలకు బీఆరెస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థుల ముందస్తు ప్రకటనతో టికెట్లు దక్కాయన్న ఆనందం కంటే రానున్న ఎన్నికల ఖర్చు తలుచుకుంటే వచ్చే దిగులే అభ్యర్థులను ఎక్కువ భయపెడుతుందన్న చర్చ వినిపిస్తుంది. ఎంతలేదన్న ఎన్నికల పోలింగ్కు మూడు నెలల గడువు ఉండటంతో అప్పటిదాకా పార్టీ కేడర్ను, ఓటర్లను ప్రసన్నం […]
Telangana |
విధాత: అసెంబ్లీ ఎన్నికలకు బీఆరెస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థుల ముందస్తు ప్రకటనతో టికెట్లు దక్కాయన్న ఆనందం కంటే రానున్న ఎన్నికల ఖర్చు తలుచుకుంటే వచ్చే దిగులే అభ్యర్థులను ఎక్కువ భయపెడుతుందన్న చర్చ వినిపిస్తుంది. ఎంతలేదన్న ఎన్నికల పోలింగ్కు మూడు నెలల గడువు ఉండటంతో అప్పటిదాకా పార్టీ కేడర్ను, ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ వెళ్లడం ఆర్ధిక భారాన్ని, అప్పులను మిగిల్చే పరిస్థితికి దారి తీయవచ్చన్న ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది.
మరి ముఖ్యంగా ఈ మూడు నెలల కాలంలో వరుసగా వస్తున్న పండుగలు ఎన్నికల వ్యయాన్ని, అభ్యర్థుల ఖర్చులను మరింత అధికం చేయనున్నాయన్న బెంగ అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. కోట్లకు కోట్లు కుమ్మరించి ఎన్నికలను ఎదుర్కోన్నాక ఓడితే ఆర్ధికంగా మరిన్ని తిప్పల పాలుకాకతప్పదన్న ఆందోళన వారిలో గుబులు రేపుతుంది. ఈ దఫా ఎన్నికల వ్యయం మరింత ఖర్చుతో కూడుకుంటుందన్న అంచనాలతో పోటీపడి గెలుపు సాధనకు అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సివస్తుంది.
హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలలో 1000కోట్ల మేరకు ఖర్చు జరిగిందని, ఈ ఉప ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల ఖర్చును దేశంలోనే అత్యంత ఖరీదుగా మార్చేశాయని దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు సైతం ఆందోళనకు గురయ్యాయి. అధికార బీఆరెస్ పార్టీ మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్ధులను ఖరారు చేయడం.. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, అభ్యర్థులుగా వారికి ఆర్ధిక వనరులు కూడా ఎక్కువ సమకూరనుండటంతో వారికి సహజంగానే ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువ ఖర్చు జరగునుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ రెండో వారం కల్లా కాంగ్రెస్, బీజేపీలు సైతం మెజార్టీ అభ్యర్లులను ప్రకటించనున్న నేపధ్యంలో వారికి కూడా ఎన్నికల ప్రచార ఖర్చులు మొదలవ్వనున్నాయి.
ఈ నేపధ్యంలో మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఈ ఎన్నికల్లో గెలుపు సాధనకు ఆర్ధిక పందెరం నిర్వహించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇతర నాలుగు రాష్ట్రాలలో ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ సాగుతుండగా, తెలంగాణకు వచ్చే సరికి త్రిముఖ పోటీ సాగనుండటంతో ఎన్నికల వ్యయం సైతం అదే స్థాయిలో పెరగనుంది. ముఖాముఖీ ఉన్న చోట అభ్యర్థుల ఎన్నికల ఖర్చు సగటుగా 100కోట్ల పైమాటే అంటున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో, త్రిముఖ పోటీ ఉన్నచోట్ల కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఖర్చు ఖాయమంటున్నారు.
మూడు నెలల సమయంతో అదనపు భారం
పోలింగ్కు సమయం మూడు నెలల పాటు ఎక్కువ సమయం ఉండటమే అభ్యర్థులకు ఆర్ధిక భారంగా పరిణమించిందని వాపోతున్నారు. ఇప్పటినుంచే గ్రామాల్లో కుల సంఘాలు, సామాజిక వర్గాల వారిగా, వార్డుల వారిగా సమావేశాలు పెట్టాల్సివుండటం…ఓటర్లను సంతృప్తి పరుచాల్సివుండటం, అనుచరులు చేజారిపోకుండా చూసుకోవడం, ప్రచార ఖర్చులు వంటివన్ని అధికం కానున్నాయి. ప్రచార మెటిరీయల్, వాహనాల ఖర్చులు, సభలు సమావేశాలకు జనసమీకరణకు, సోషల్ మీడియాకు మరింత ఖర్చుకానుంది.
బీఆరెస్ దాదాపుగా సిట్టింగ్లకే మళ్లీ టికెట్లు ఇవ్వడంతో వారు ఓటర్ల డిమాండ్కు అనుగుణంగా సీసీ రోడ్లు, మంచినీటీ వసతులు, సంక్షేమ పథకాల మంజూరు వంటి వాటిని నిధులు మంజూరు చేస్తున్నారు. నిధులు ఇవ్వలేని వాటికి సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ప్రతిపక్షాల అభ్యర్థులు సైతం అధికార పార్టీకి ధీటుగా ఎన్నికల ఖర్చుకు వెనుకాడకూడదన్న ఆలోఛనతో ఆస్తులను అమ్ముకుంటూ, తాకట్టు పెట్టుకుంటూ, అప్పులు చేస్తూ, బంధుమిత్రులందించే విరాళాల ద్వారా నిధుల సమీకరణకు తంటాలు పడుతున్నారు.
కాగా ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయం నిబంధనల నేపధ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వీలైనంత మేరకు ఓటర్లను, కేడర్ను, అసంతృప్తి నాయకులను ప్రసన్నం చేసుకుని అధికారిక ఎన్నికల ఖర్చుల లెక్కల బారి నుంచి తప్పించుకోవాలని అభ్యర్థులు ఆరాటపడుతున్నాారు. ఇందుకోసం ఎన్నికల ఖర్చుకు ఇప్పటినుంచే కావాల్సిన డబ్బులను సమకూర్చుకునేందుకు అభ్యర్థులు ఎవరిపాట్లు వారు పడుతున్నారు.
పెరిగిపోతున్న అసెంబ్లీ ఎన్నికల ఖర్చులు తట్టుకోవడానికి కొంతమంది అభ్యర్థులు ఇప్పటినుంచే ఎంపీ ఎన్నికల టికెట్లను ఆశిస్తున్న ఆశావహుల సహకారం కోరుతున్నారు. ఎంపీ టికెట్లు పక్కా అనుకుంటున్న వారు తమ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులకు తమవంతు సహకార అందించేందుకు ముందుకు వస్తే వారికి కొంత ఊరట దక్కనుంది.
భయపెడుతున్న వరుస పండుగలు
తెలంగాణలో వరుసగా రానున్న బతుకమ్మ పండుగలు అభ్యర్థులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో బోనాల పండుగలు కొనసాగుతుండగా, గ్రామదేవతల ఆలయాలకు భారీగా విరాళాలు అందించాల్సివస్తుంది. సెప్టెంబర్లో వినాయక చవితికి విగ్రహాలకు విరాళాలు దండిగా ఇవ్వాల్సిందే. గల్లీగల్లీకి వాడవాడకు వినాయక నవరాత్రి ఉత్సవ మండపాటలు అభ్యర్థుల పేరిట పోటాపోటీగా నెలకొనే పరిస్థితి ఉంది.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగియగానే బతుకమ్మ పండుగ నుంది. అధికార బీఆరెస్ పార్టీ ప్రభుత్వ పరంగానే బతుకమ్మ చీరల పంపిణీ చేయనుంది. సాధారణ సమయాల్లో ప్రతిపక్షాలు చీరల పంపిణీలో పోటీ పడాల్సిన అవసరం లేకపోయినా…ఎన్నికల ప్రచారం పర్వంలో వచ్చిన బతుకమ్మ ఉత్సవాల్లో తమ ఉనికి కోసం చీరల పంపిణీకి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులలో కూడా కొంత మంది యధాశక్తి చీరల పంపిణీకి ముందస్తు అర్డర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది.
కొంతమంది అభ్యర్థులు చీరలతో పాటు పసుపు కుంకుమ, చీరలు, గాజులు వంటి వన్గ్రామ్ గోల్డ్ జ్యూవెలరీ వస్తువులను కూడా అందించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రానున్న దసరా పండుగకు ఈదఫా అభ్యర్థులకు చుక్కలు చూపించనుంది. సామాజిక వర్గాల ఓటు బ్యాంకుల వారిగా మేకలు, గొర్రెలు, ఇంటింటికి మటన్, కోళ్లు పంపిణీకి అభ్యర్థులు పోటీ పడనున్నారు. తదుపరి దీపావళీ పండుగ సందర్భంగా కూడా టపాసులు, స్వీట్ల డబ్బాల పంపిణీ చేయనున్నారు.
ఎన్నికల డబ్బు కట్టడికి మరింత నిఘా
దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నికల్లో డబ్బు ప్రభావం అంతకంతకు పెరుగుతున్న తీరుపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి మరింత మెరుగ్గా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలను తీసుకునేందుకు సన్నద్ధమవుతుంది. ఎన్నికల నిబంధనల మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా పెద్ద రాష్ట్రాల్లో 40లక్షలు, 28లక్షలు ఖర్చు , ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులు పెద్ద రాష్ట్రాల్లో 95లక్షలు, చిన్న రాష్ట్రాల్లో 75లక్షలు ఖర్చు చేసుకునే వీలుంది.
అయితే కోట్లలో అభ్యర్థులు ఖర్చు చేస్తుండటం, అక్రమ మార్గాల్లో ఓటర్లకు, సామాజిక వర్గాల వారిగా సంఘాలకు ఖర్చు చేస్తుండటంతో ఎన్నికలలో ధన ప్రభావం అధికమవుతుంది. ఈ విపరీత ధోరణిని వీలైనంత వరకు నియంత్రించేందుకు ఎన్నికల సంఘం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశంలో వివిధ విభాగాలుగా ఉన్న 20కిపైగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా ఏజెన్సీలకు ఎన్నికల సంఘం సమాచారాన్ని సైతం పంపించింది.