లీకేజీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి పరీక్షా కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగింపు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పదవ తరగతి ప్రశ్నాపత్రాల వరుస లీకేజీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నిద్ర మత్తు వదిలి రాష్ట్ర విద్యాశాఖ జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. పరీక్షల నిర్వహణ […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పదవ తరగతి ప్రశ్నాపత్రాల వరుస లీకేజీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నిద్ర మత్తు వదిలి రాష్ట్ర విద్యాశాఖ జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. పరీక్షల నిర్వహణ వ్యవహారాన్ని ఆషామాషిగా తీసుకోకుండా కఠినంగా నిబంధనలు అమలు చేయాలని అధికారులను హెచ్చరించింది.
టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజులు తెలుగు, హిందీ పేపర్లు లీకైనట్లు దుమారం రేకెత్తిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. నిన్న వికారాబాద్ తాండూరులో ఈరోజు హనుమకొండ జిల్లాలో పేపర్లు లీకైన విషయం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
రాష్ట్రంలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలో ప్రశ్నా పత్రాల లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.
మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ, గత రెండు రోజులుగా 10వ తరగతి ప్రశ్నా పత్రాలు లీకేజీ కావడం పట్ల కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్, ఎస్పీలు అప్రమత్తం కావాలని, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహించాలని మంత్రి తెలిపారు.
10వ తరగతి పరీక్షల నిర్వహణ లో దాదాపు 57 వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, ఒకరిద్దరు చేసిన తప్పిదాలతో పిల్లలు, తల్లి దండ్రులు ఆందోళనకు గురవుతున్నారని మంత్రి తెలిపారు. పరీక్ష ప్రారంభించిన తర్వాత పేపర్ బయటకు వచ్చిందని, దీని వల్ల ప్రభుత్వానికి అనవసరంగా చెడ్డ పేరు వస్తుందని మంత్రి తెలిపారు.
పరీక్షా కేంద్రాల ప్రాంతాల్లో అత్యంత కఠినంగా 144 సెక్షన్ అమలు చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో సెక్యూరిటీ టైట్ చేయాలని, పరీక్షా కేంద్రాల లోపలికి ఎవరికి సెల్ ఫోన్ లను అనుమతించ రాదని, జిల్లా కలెక్టర్ లు, తహసిల్దార్ లు సైతం సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళవద్దని తెలిపారు.
10వ తరగతి జవాబు పత్రాల రవాణా సమయంలో స్థానిక పోస్టల్ అధికారులకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. మిగిలిన 4 పరీక్షలు సజావుగా జరిగే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో అదనపు పేట్రోలింగ్ చేయాలని, క్షేత్రస్థాయి వరకు ఎక్కడా అలసత్వం జర్గకుండా అప్రమత్తం వహించాలని తెలిపారు.
ప్రశ్న పత్రాల లీకేజీ లకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల పై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, విద్యా శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించడం జరుగుతుందని తెలిపారు.
సీపీ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీపీ రంగనాధ్ మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్నీ జాగ్రత్త లు తీసుకుంటున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు, పరీక్షా కేంద్రాల్లోకి ఎవ్వరికీ సెల్ ఫోన్ అనుమతించడం లేదని అన్నారు. పరీక్ష కేంద్రాలలో అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యా, అడిషనల్ కలెక్టర్ లు సంధ్యా రాణి శ్రీ వత్స(రెవెన్యూ), DEO హనుమకొండ అబ్దుల్ హై, DEO వరంగల్ వాసంతి, MEO లు, విద్యా శాఖ అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.