వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి
విధాత : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1:45కు గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ వారిని వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుని పులకించారు. స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్న భక్తజనుల గోవింద నామస్మరణ లతో సప్తగిరులు మారుమోగాయి.
పలువురు ప్రముఖులు సైతం తిరుమల స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎస్ ఎల్ భ, కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గేహ్లాట్ , ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, ఉష శ్రీ చరణ్, మెరుగు నాగార్జున, అంబటి రాంబాబు, కారుమూరి,అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు, సీఎం రమేష్, అచ్చం నాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. రేపు ద్వాదశి సందర్భంగా స్వామివారికి చక్రస్నానం నిర్వహించనున్నారు.
అటు తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం 6:42 నరసింహుడు గరుడ వాహనంపై శ్రీ వైకుంఠనాధుడు మహావిష్ణువు రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున తొలి మంచు తెరల మధ్య స్వామివారి ఉత్తర ద్వార దర్శనం తిలకించిన భక్తజనం గోవింద నామ్మరణలతో యాదాద్రి కొండ పరిసరాలు ప్రతిధ్వనించాయి.
భద్రాద్రి రామాలయంలో, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజేశ్వర స్వామి, మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ద్వారకాతిరుమల, అన్నవరం సత్యనారాయణ సహా ప్రముఖ వైష్ణవాలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.