Chandranath Rath | పశ్చిమ బెంగాల్( West Bengal )లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం.. హత్య రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి( Suvendu Adhikari ) పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్ రథ్ (Chandranath Rath ) ను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. నార్త్ 24 పారగణ జిల్లాల్లో మధ్యగ్రామ్ సమీపంలో చంద్రనాథ్ వెళ్తున్న కారుపై ఓ ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి పరారీ అయ్యారు. రథ్కు బుల్లెట్ గాయాలు బలంగా తగలడంతో ప్రాణాలు కోల్పోయారు. రథ్ హత్య బెంగాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
ఎవరీ చంద్రనాథ్ రథ్..?
చంద్రనాథ్ రథ్(41) స్వస్థలం పుర్బా మేధినిపూర్ జిల్లాలోని చాందీపూర్. రహరా రామకృష్ణ మిషన్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. అనంతరం స్వచ్ఛందం పదవీ విరమణ తీసుకున్నారు. ఇక సొంతూరికి చేరుకున్న రథ్.. కార్పొరేట్ రంగంలో పని చేశారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉండడంతో.. కార్పొరేట్ రంగాన్ని వదిలేసి.. సువేందు అధికారి దగ్గర చేరారు.
సువేందు అధికారితో పరిచయం ఇలా..!
చంద్రనాథ్ రథ్ తల్లి హషీ రథ్.. స్థానిక నాయకురాలు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కొన్నేండ్ల పాటు పని చేశారు. స్థానిక పంచాయతీలో కూడా హషీ సేవలందించారు. 2020లో సువేందు అధికారి టీఎంసీని వీడినప్పుడు హషీ రథ్ కూడా పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత సువేందుతో పాటు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. అలా సువేందు అధికారికి చంద్రనాథ్ రథ్ దగ్గరయ్యారు.
2019 నుంచే అధికారికి పీఏ..!
టీఎంసీలో ఉన్నప్పుడే సువేందు అధికారికి చంద్రనాథ్ రథ్ పర్సనల్ అసిస్టెంట్గా చేరిపోయారు. 2019లో మమతా ప్రభుత్వంలో సువేందు మంత్రిగా కొనసాగుతున్నప్పటి నుంచి ఆయన కార్యకలాపాలన్నీ చంద్రనాథ్ చూసేవారు. అధికారి బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆయనకు వెన్నంటి ఉన్నారు రథ్. ఇక సువేందు అధికారి రాజకీయ ఎత్తుగడల్లోనూ రథ్ భాగమయ్యారు. పార్టీ వర్కర్లను సమన్వయం చేయడంలో కీలకంగా ఉన్నారు.
మమతా అల్లుడి పనేనా..?
అయితే బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అధికారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే.. రథ్కు కీలక పదవులు దక్కే అవకాశం ఉందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రథ్ను అతని శత్రువులు చంపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రనాథ్ రథ్ హత్య వెనుకాల మమతా బెనర్జీ అల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రమేయం ఉందని సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. పక్కా ప్లాన్తోనే తన పీఏను హత్య చేశారని అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
