బీఆర్ఎస్, బీజేపీ వాళ్లతప్పులు ప్రశ్నిస్తున్నానని కొడంగల్లో నన్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు వేర్వేరైనప్పటికి వాళ్ల లక్ష్యం మాత్రం నన్ను దెబ్బతీయడం ఒక్కటేనన్నారు. నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్కు ఓట్లు వేసే వాళ్ల ఓట్లు తొలగిస్తున్నారని, నాపై కుట్రలు చేసే వాళ్లను ఇక్కడి కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలని సీఎం కోరారు.
బుధవారం కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నేతలు, బీఎల్ఏలూ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని తన ఎస్ఐఆర్ ఫామ్ నింపి అధికారులకు ఇచ్చారు. అనంతరం కొడంగల్లో సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి స్థానిక నాయకత్వానికి, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు.
ఓటు లేకపోతే పథకాలు అందవు..
ఓటు లేని మనిషి చచ్చిపోయిన వారితో సమానం అని, ఓటరు జాబితాలో లేకపోతే ప్రభుత్వ పథకాలు రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే అంతా ఓటు విలువ గుర్తెరిగి ఎస్ఐఆర్ నింపి ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ కు పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90శాతం ఓట్లు వేస్తారని తెలిసి..వారి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కొడంగల్లో 78శాతం ఓటర్లు నమోదు చేసుకున్నారని, మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాలి. మిగిలిన ఓటర్లతో బీఎల్ఏలు ఎస్ఐఆర్ నమోదు చేయించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే నిర్ణయం అవుతుందని,. కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగించేందుకు వీల్లేదనరి స్పష్టం చేశారు. గడువు నాటికి కొడంగల్లో 100శాతం ఎస్ఐఆర్ పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోవట్లేదన్నారు. ప్రతి పేదవాడికి మంచి చేసేందకు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవట్లేదు. కొడంగల్లో నేరుగా ఎదుర్కోలేక నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొడంగల్లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారన్నారు. అందుకే నన్ను దెబ్బతీసే వారిని కొడంగల్ ఓటర్లే దెబ్బకొట్టాలని కోరారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కొడంగల్లో పార్టీ నేతలతో కలిసి సీఎం ధర్నా ర్యాలీలో పాల్గొన్నారు.