అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక మార్పుల క్రమంలో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అందుకు భిన్నంగా వెండి ధర పెరిగింది. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,330 తగ్గి రూ.1,55,350 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,050 తగ్గి రూ. 1,42,400వద్ద ఆగింది. కిలో వెండి ధర మాత్రం అనూహ్యంగా రూ.5,000 పెరిగి రూ. 2,55,000 వద్దకు చేరింది. ఆగస్టు 24వ తేదీన తులం బంగారం రూ.1,63,970వద్దకు చేరగా..పది రోజుల వ్యవధిలోనే రూ.8,620 తగ్గడం గమనార్హం. దేశీయంగా శుభకార్యాల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ధరలు కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తున్నాయి.
హెచ్చుతగ్గుల కొనసాగింపులు ఖాయం..
భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు ఒత్తిడిలోనే కొనసాగుతూ హెచ్చుతగ్గులను నమోదు చేస్తాయని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ కమోడిటీస్ & కరెన్సీస్ రీసెర్చ్ అనలిస్ట్ వేదికా నర్వేకర్ వెల్లడించారు. సాంకేతిక సూచికల ప్రకారం.. స్పాట్ గోల్డ్ ప్రస్తుతం ఔన్సుకు 4,300 డాలర్ల కీలక మద్దతు స్థాయి వద్ద ముగిసింది. ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే ధరలు $4,200 నుండి $4,220 డాలర్లకు పడిపోవచ్చని సూచించింది.
ఒకవేళ ఇక్కడి నుండి పుంజుకుంటే, ధరలు మళ్లీ $4,450 డాలర్ల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంసీఎక్స్లో రూ. 1,47,700 నుండి రూ. 1,48,000 స్థాయిలు అనుకూలమైన కొనుగోలు స్టాయిలుగా భావించవచ్చంటున్నారు. మరోవైపు వెండి విషయానికి వస్తే, కేవలం ద్రవ్య విధానమే కాకుండా పారిశ్రామిక డిమాండ్, ప్రపంచ వృద్ధి రేటుపై ఆధారపడి ఉండటం వల్ల దాని ధరలలో మరింత ఎక్కువ అస్థిరత కొనసాగవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.