చైన్నై మ్యూజియం పునరుద్దరణ..పురాతన విగ్రహాలకు కరువైన రక్షణ

చెన్నై ప్రభుత్వ మ్యూజియం పునరుద్ధరణ పనుల్లో పురాతన విగ్రహాలు, కళాఖండాలు రక్షణ లేకుండా చెత్త మధ్య ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది.

భారత దేశంలోని చైన్నై పురాతన మ్యూజియం పునరుద్దరణ పనుల్లో నిర్లక్ష్యం.. మ్యూజియం లక్ష్యాలను నీరుగారుస్తుంందన్న తీవ్ర విమర్శలకు గురవుతుంది. మ్యూజియం పునరుద్దరణ పనుల పేరుతో పురాతన విగ్రహాలను, దేవతా శిల్పాలను, కళాఖండాలను నిర్లక్ష్యంగా ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా..పరిసరాల్లోని చెత్త కుప్పల మధ్య పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశం నలుమూలల నుంచి సేకరించిన ప్రాచీన, చారిత్రక శిల్ప సంపదను ఈ పురాతన మ్యూజియంలో పొందుపరిచారు. ఇటీవల మ్యూజియం పునరుద్దరణ, విస్తరణ పనలు చేపట్టారు. అయితే అందులోని విగ్రహాల పరిరక్షణకు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో విలువైన పురావస్తు సంపద ధ్వంసమయ్యే ప్రమాదంలో పడిపోయింది.

క్రీ.శ. 3వ శతాబ్దం, అంతకంటే ముందు కాలానికి చెందిన అమూల్యమైన పురాతన కళాఖండాలను పనికిరాని చెత్తలాగా మ్యూజియం పరిసరాల్లో పడేశారు. వాటి చుట్టు హడావిడిగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. పునరద్దరణ పనులతో, నిర్మాణ సామాగ్రీ, వ్యర్థాలతో అందమైన చారిత్రక శిల్పాలు ప్రమాదంలో పడ్డాయి. నిర్మాణ పైపులు, శిథిలాలు, భారీ యంత్రాల కింద అపూర్వ శిల్ప సంపద కూరుకుపోతున్న దృశ్యాల వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెంటనే అమూల్య శిల్ప సంపదను కాపాడుకునేందుకు ఏఎస్ఐ, తమిళనాడు పురావస్తు శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు గతంలో తరలిపోయిన ప్రాచీన శిల్పాలు, దేవతా మూర్తులు, కళాఖండాలను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తుంటే..మరోవైపు స్వదేశంలోని ప్రఖ్యాత చైన్నై మ్యూజియంలో ప్రాచీన శిల్ప సంపద, కళాఖండాలు నిర్లక్ష్యానికి గురికావడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.

చైన్నై మ్యూజియం చరిత్ర..

చెన్నైలోని ప్రభుత్వ మ్యూజియం (మద్రాస్ మ్యూజియం)ఎగ్మోర్‌లోని పాంథియాన్ రోడ్డులో ఉంది. 1851లో స్థాపించబడిన ఈ మ్యూజియం, భారతదేశంలోనే రెండవ పురాతన మ్యూజియం. భారతదేశంలోని చారిత్రక మ్యూజియాలలో మొదటిది కోలకతా లో ఉంది, దీనిని 1814 సంవత్సరంలో స్థాపించారు. ఇక చెన్నై పట్టణం మ్యూజియం దక్షిణ ఆసియాలోని అతిపెద్ద మ్యూజియంలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది 16.25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిలో ఆరు స్వతంత్ర భవనాలు, 46 గ్యాలరీలు ఉన్నాయి.

ప్రధాన భవనం, కాంస్య గ్యాలరీ, చిల్డ్రన్స్ మ్యూజియం (పిల్లల విభాగం), జాతీయ ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. దీనిని ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మించారు. ఈ భవనం నందు రాజా రవి వర్మ వంటి వారు తయారు చేసిన అరుదైన కళాఖండాలు ఉన్నాయి. ఇక్కడే అద్భుతమైన మ్యూజియం థియేటర్ కూడా ఒక ప్రధాన ఆకర్షణ. చెన్నై మ్యూజియం ప్రత్యేకతలో ముఖ్యమైన పురావస్తు, నాణేల సేకరణలతో పాటు రోమన్ ప్రాచీనకాలం నాటి ప్రాముఖ్యత గల అతిపెద్ద పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శనలో ఉంచడం విశేషం.

చచ్చిన కాలేజీ, బతికిన కాలేజీ

చైన్నై మ్యూజియం ప్రాంగణంలోని ఒక భవనంలో చనిపోయిన అన్ని జంతువుల శరీరాలను ఇక్కడ భద్ర పరిచారు. ఇక్కడ అన్ని జీవులకు సంబంధించిన కళేబరాలు ప్రదర్శనలో పెట్టారు. అందుకే ఈ మ్యూజియాన్ని తెలుగువారు చచ్చిన కాలేజీ అని. మద్రాసులోని మరొక ప్రాంతంలో ఉన్న జూపార్కును బతికిన కాలేజీ అని పిలుచుకుంటుండటం ఆసక్తికరం.

Latest News