కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర2.0కు సిద్ధమయ్యారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికల నగారా మోగనుండటంతో కాంగ్రెస్ జోడో యాత్ర2.0 చేయాలని నిర్ణయించుకున్నారు
విధాత: భారత్ జోడో యాత్ర 2.0 ను రాహుల్ గాంధీ జనవరి మొదటి వారంలో మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు జాతీయ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. రెండవ విడత జోడోయాత్ర తూర్పు నుంచి పశ్చిమ వైపు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఈ యాత్ర నడుస్తుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలో జరుగుతోంది. రాహుల్ గాంధీ మొదటి విడత జోడో యాత్ర నిర్వహించడంతో కాంగ్రెస్ పార్టీ బలపడింది. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పెరిగింది. క్యాడర్ మరింత శ్రమించి పని చేస్తున్నారు. పార్టీని వీడిన నేతలు ఒక్కొక్కరుగా తిరిగి పార్టీలో చేరుతున్నారు. జోడో యాత్ర జరిగిన కర్ణాటక, తెలంగాణలలో పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పాటు బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కాంగ్రెస్తో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాయి. దీంతో ఇండియా కూటమి ఏర్పడింది.
ఏడాది తర్వాత రెండో విడత
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓటమి చెందినప్పటికీ, ఓట్లు మాత్రం బీజేపీకి ఏమాత్రం తగ్గకుండా వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా బలహీన పడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా రాహుల్ గాంధీ నిర్నహించిన జోడో యాత్ర ప్రభావమేనన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ మొదటి విడత భారత్ జోడో యాత్రను 7 సెప్టెంబర్ 22న కన్యాకుమారిలో ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల మీదుగా 75 జిల్లాలు, 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో నిర్వహించిన రాహుల్ శ్రీనగర్లో తన పాదయాత్రను 30 జనవరి 23న ముగించారు. తిరిగి ఏడాది తరువాత రెండవ విడత భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ వచ్చేనెల మొదటి వారం నుంచి చేపట్ాడానికి ఏర్పాటు చేస్తున్నారు. రాహుల్ జోడో యాత్ర ప్రభావం లోక్ సభ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.