పెళ్లి బృందం కారు అదుపు తప్పి చెరువులో పడిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఒడిస్సా భువనేశ్వర్లోని దేంకానాల్ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులోని ఏడుగురిలో ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు ప్రాణాలతో ఉండగా, వారిని దేంకానాల్ ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేశ్ సాహు, రామ్సాహులుగా గుర్తించారు. వారంతా వివాహానికి హాజరై, స్వగ్రామానికి వెళ్తుండగా సదర్ ఠాణా పరిధిలోని మహిషాపుటా వద్ద గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.
ఇంకోవైపు కేంఝర్ జిల్లాలో సైతం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అస్వస్థతకు గురైన తమ కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
