న్యాయమే భారత్ జోడో న్యాయ్ యాత్ర లక్ష్యమని, ప్రజలంతా అన్యాయ కాలం ఉన్నారని, వారిని న్యాయ కాలంలోకి నడిపిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు
– కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ స్పష్టీకరణ
– అన్యాయ కాలం నుంచి న్యాయ కాలంలోకి యాత్ర పురోగమనం
– మోడీ పాలనలో ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లిన దేశ సంపద
– ధరల పెరుగుదలతో దుర్భరంగా సామాన్యుల జీవనం
– జన సమస్యలపై..మోడీపాలనా వైఫల్యాలపై యాత్రలో నిలదీస్తాం
– బీజేపీ విభజన రాజకీయాలకు మణిపూర్ నిదర్శనం
– రాజ్యాంగ ప్రవేశిక రక్షణకే రాహుల్ యాత్ర : ఖర్గే
– మోడీ విభజన రాజకీయాలపై మండిపాటు
విధాత: న్యాయమే భారత్ జోడో న్యాయ్ యాత్ర లక్ష్యమని, ప్రజలంతా అన్యాయ కాలంలో ఉన్నారని, వారిని న్యాయ కాలంలోకి నడిపిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ఆదివారం తన రెండో దశ భారత్ జోడో న్యాయ్ యాత్రను మణిపూర్ తౌబల్ జిల్లాలోని ఖోంగ్జోమ్ వార్ మెమోరియల్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీ ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్గాంధీ మాట్లాడుతూ న్యాయ్ యాత్ర ఎందుకు చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయ్ యాత్ర చేపట్టామని, దేశ ప్రజల మధ్య ఐక్యత.. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, ప్రజలందరికీ న్యాయం అనే సందేశంతో యాత్ర కొనసాగుతుందన్నారు. దేశంలో సంపద, వ్యాపారాలు ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లాయని, ధరలు పెరగడంతో సామాన్యులు బతకడం కష్టంగా మారిందన్నారు. అణగారిన వర్గాల బాధలను పట్టించుకునే వారు లేరని, ఆయా సమస్యలపై న్యాయ యాత్రలో మేము ప్రశ్నిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారులు, మహిళలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. తొలివిడత భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు. నేను జూన్ 29న మణిపూర్ వచ్చానని, ఆ సమయంలో నేను చూసినవి, విన్నవి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, వినలేదన్నారు. ఆ తర్వాతా మణిపూర్లో పాలనా వ్యవస్థలన్ని కుప్పకూలాయని, మణిపూర్ గతంలో మాదిరిగా ఇప్పుడు లేదని, కొంతకాలంగా మణిపూర్ రగులుతూనే ఉందన్నారు. ప్రధాని మోడీకి మణిపూర్ భారత్లో అంతర్భాగంగా కనిపించడం లేదని విమర్శించారు. అల్లర్లతో మారణహోమం సాగిన మణిపూర్కు ఇంతవరకు ప్రధాని మోడీ రాలేదని, మీ కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ విభజన రాజకీయాలకు మణిపూర్ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. మణిపూర్ కు గత విలువను, శాంతిని, గౌరవాన్ని తిరిగి తీసుకొస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
రాజ్యాంగ పీఠిక రక్షణకే న్యాయ్ యాత్ర : ఖర్గే
రాజ్యాంగ ప్రవేశికను రక్షించేందుకు రాహుల్ పోరాడుతున్నారని, అందుకే న్యాయ్ యాత్ర కొనసాగిస్తున్నారన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ మతాన్ని రాజకీయాలతో కలుపుతూ… ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. తాము లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. మణిపూర్ ప్రజల ఓట్లను అడిగేందుకే ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని, కానీ వారు బాధలో ఉన్నప్పుడు రాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరికి దేవుడిపై నమ్మకం ఉందని, కానీ ఓట్ల కోసం ఇలా చేయకండని, ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్నారు.
రాహుల్గాంధీకి ఘన స్వాగతం
అంతకుముందు ఇంపాల్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం’ వద్దకు వెళ్లారు. 1891 ఆంగ్లో-మణిపూర్ యుద్ధంలో అమరులైనవారికి నివాళులర్పించారు. అనంతరం ‘న్యాయ్ మైదాన్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు సాగే యాత్రను ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఖర్గేతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాగా.. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల హాజరయ్యారు.
67రోజులు.. 6,713 కిలోమీటర్లు సాగనున్న న్యాయ్ యాత్ర
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మొత్తం 15 రాష్ట్రాల మీదుగా 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 66 రోజుల పాటు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబయిలో ముగుస్తుంది. దీని ద్వారా సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ మత రాజకీయాలను, విభజన విద్వేష విధానాలను, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఎన్నికలకు, న్యాయ్ యాత్రకు సంబంధం లేదని, ఇదో సైద్ధాంతిక యాత్ర అని పేర్కొంది. తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని, ప్రతి రోజు రెండు కార్నర్ మీటింగ్లు ఉంటాయని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. బస్సులతో పాటు అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని వివరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించారు.