Prashant Kishore | ప్రశాంత్ కిషోర్ హెచ్చరిక: తెలంగాణకు వస్తా.. రేవంత్​ను ఓడించి తీరుతా..

ఎన్నికల వ్యూహకర్త ప్ర‌శాంత్ కిషోర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని ఓడిస్తానని వార్నింగ్ ఇచ్చారు. బీహారీ ప్రజలపై రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prashant Kishor Vows to Defeat Telangana CM Revanth Reddy in Next Elections

Prashant Kishor Vows to Defeat Telangana CM Revanth Reddy in Next Elections

న్యూఢిల్లీ, అక్టోబర్ 3, 2025:

ఎన్నికల వ్యూహకర్త, జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. “వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి రేవంత్‌ను ఓడించి తీరతాం. రాహుల్ గాంధీ కాదు కదా, ఎవరూ ఆయన్ను కాపాడలేరు” అని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. టైమ్స్ నౌ ఇచ్చిన ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వ్యూలో, బీహారీలను కించపరిచిన రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశాంత్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

బీహార్ DNAపై రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు

2023 డిసెంబర్‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)లో “బీహార్ DNA” ఉందని, తనలో “తెలంగాణ DNA” ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహారీల DNA తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువ అని సూచించిన ఈ మాటలు ప్రశాంత్ కిషోర్‌కు ఆగ్రహం తెప్పించాయి. రేవంత్ మూడుసార్లు తనను కలిసి ఎన్నికల వ్యూహాలకు సహాయం కోరినప్పటికీ, తాను సహాయం చేయలేదని కూడా ప్రశాంత్ తెలిపారు.

‘ఎవరికీ భయపడము.. రేవంత్ లెక్క సరి చేస్తాం’

“బీహారీలను తిడితే మేం ఊరుకునేది లేదు. మేము తెలంగాణకు వచ్చి మిమ్మల్ని ఓడిస్తాం. మా శక్తి అంతా వాడి రేవంత్‌ను ఓడిస్తాం” అని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, మోడీ ఎవరూ రేవంత్‌ను కాపాడలేరని, ఆయన “పొలిటికల్ టర్న్‌కోట్” (పార్టీలు మార్చే వ్యక్తి) అని విమర్శించారు. బీహారీల డీఎన్ఏ పాడైందన్న రేవంత్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుస్తుంద‌ని, ఎవ‌రిది పాడైందో అప్పుడు చెప్తామని ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. బీజేపీ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌లోకి మారిన రేవంత్‌కు భగవంతుడు టైం ఇచ్చాడని, ఇప్పుడు లెక్క సరి చేస్తామని చెప్పారు.

బీహార్ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఆగ్రహం

ఈ ఏడాది చివర్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్, జనస్వరాజ్ పార్టీ ద్వారా పోటీ పడుతున్నారు. రేవంత్ బీహార్ ప్రచారంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మీదకే తిరిగాయి. ఈ విషయంలో పార్టీలకతీతంగా బీహారీలు ఒక్కటయ్యారు.  “బీహారీలను కించపరిచిన వ్యక్తికి సలహాలు ఇవ్వము. లెక్క సరి చేస్తాం” అని ప్రశాంత్ స్పష్టం చేశారు. మరోవైపు, ఎక్స్‌లో (ట్విటర్) ఈ విషయంపై వైరల్ అవుతున్న టైమ్స్ నౌ వీడియో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు?

ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ ప్రకటన 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త మార్పులు తీసుకురానుందా అని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బీహారీలపై వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఇప్పుడు ప్రశాంత్ దాడి రాజకీయంగా కాంగ్రెస్​కు గుబులు పుట్టిస్తోంది. ఇంతవరకు రేవంత్​ వ్యాఖ్యలపై రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ హైకమాండ్​ కామెంట్​ చేయకపోవడం కూడా బీహారీల ఆగ్రహానికి కారణమవుతోంది. కాంగ్రెస్​ ఈ హెచ్చరికపై ఎలా స్పందిస్తుందో చూడాల్సివుంది. మరోవైపు, ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో 125 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పోరాడుతున్నారు.

Exit mobile version