విధాత : అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో ఎదురుచూసే శబరిమల కొండ పొన్నంబల మేడుపై వెలుగే అయ్యప్ప దివ్య మకర జ్యోతి దర్శనం శుభ ఘడియలు సమీపించాయి. మధ్యాహ్నం 3:13 గంటలకు మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభం కానుండగా…సాయంత్రం 6:30 నుంచి 6:45 మధ్య మహా అద్భుత దృశ్యం మకర జ్యోతి దర్శనం ఆవిష్కృతం కానుంది. శబరిమల కొండపై కొలువైన అయ్యప్ప స్వామి దివ్యరూపం మకర జ్యోతి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు. పంచగిరులలోని పొన్నంబలమేడు కొండపై దివ్య జ్యోతి రూపం ‘మకరవిలక్కు’ (మకర జ్యోతి)గా అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. మకర జ్యోతి దివ్య దర్శనం చూసేందుకు వచ్చిన భక్తులతో శబరి గిరులు అయ్యప్ప శరణుఘోషతో మారుమోగుతున్నాయి.
అయ్యప్పస్వామి తిరువాభరణం అభరణాల ఊరేగింపు
శబరిమల అయ్యప్పస్వామి దర్శనంలో అభరణాల ఊరేగింపు ఎంతో ప్రత్యేకమైనది. జనవరి 12 న పందళం రాజప్రసాదం నుంచి బయలుదేరిన స్వామివారి పవిత్ర ఆభరణాలు నేటి సాయంత్రం 4:30 నుంచి 5:20 నిమిషాల ప్రాంతంలో సన్నిధికి చేరుకుంటాయి. మార్గమధ్యంలో ఉన్న గ్రామాలలో భక్తులు తిరువాభరణ ఊరేగింపుకు ఘనస్వాగతం పలుకుతున్నారు. కొండలుకోనలు రాళ్లు రప్పలు దాటుతూ 50 కిలో మీటర్లపైన అటవి మార్గంలో నడుచుకుంటూ ఈ యాత్ర సాగుతోంది. ఈ ఆభరణాలను తంత్రులు అయ్యప్ప స్వామికి అలంకరించి మహదీపారాధన నిర్వహిస్తారు . సాయంత్రం దీపారాధన అనంతరం, పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమివ్వనుంది. సాయంత్రం 6:30 నుంచి 6:45 మధ్య మహా అద్భుత దృశ్యం మకర జ్యోతి దర్శనం ఆవిష్కృతం కానుంది. మకరజ్యోతి దర్శనం సందర్భంగా సన్నిధానం, పంబ, శబరిమల కొండ, నీలిమల ప్రాంతాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. ఆంక్షలు అమలులో ఉన్న కారణంగా శబరిమల కొండపైకి 40 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిచ్చినట్లుగా సమాచారం. ఈ దివ్యజ్యోతి దర్శనంతో అయ్యప్ప దీక్ష సంపూర్ణమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆ తొమ్మిది ప్రాంతాల నుంచే దివ్య జ్యోతి దర్శనం
ప్రతీ ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబల మేడుపై మకరజ్యోతిని వెలిగిస్తారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణతో.. తలపై ఇరుముడితో శబరిమలకు చేరకుంటారు. మకరవిలక్కు (మకరజ్యోతి) పర్వదినం సందర్భంగా కొండపై నుంచే ఆ దివ్య రూపాన్ని దర్శించుకోవాలని తాపత్రయ పడుతుంటారు భక్తులు. పంచగిరులపై ఆ క్షణం కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తారు భక్తులు.పంచగిరులైన నీలిమల, కరిమల, శబరిమల , అప్పాచిమేడు , అలుదామేడు ప్రాంతాల్లో ఈ తొమ్మిది ప్రాంతాల నుంచే ఆ దివ్య జ్యోతి దర్శనం స్పష్టంగా కనిపిస్తుంది. శబరిమల కొండపై ఉన్న అయ్యప్ప సన్నిదానం , పాండితావళం, మాలికాపురం – అట్టతోడు, నీలిమల కొండ హిల్ టాప్, పులిమేడు, శరణ్ గుత్తి, మరకూట్టం, పంబ, శబరిమల ఎంట్రీ పాయింట్ల వద్ద నుండి దేదీప్యమానంగా వెలిగే ఆ దివ్య జ్యోతి స్వరూపాన్ని స్పష్టంగా చూడవచ్చు. భక్తులు మాత్రం అయ్యప్ప సన్నిదానం నుంచే ఆ మకరజ్యోతిని దర్శించుకోవాలని పోటీపడుతారు. జనవరి 15 నుంచి 19న రాత్రి 9 గంటల వరకు అయ్యప్ప దివ్య దర్శనం కొనసాగనుంది. 19న హరివరాసనం పూర్తవగానే భక్తులకు దర్శనం నిలిపివేస్తారు. జనవరి నెల 20 న ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు.
