• Telugu News
  • /National

Lok Sabha elections | మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ షురూ.. గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని

Lok Sabha elections | దేశవ్యాప్తంగా మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో ఓటింగ్‌ ప్రారంభానికి ముందు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర క్యూలైన్‌లలో నిలబడ్డారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

Reported by: Thyagi | జాతీయం | May 07, 2024, 8:10 am IST
Read Time: 3 mins
Lok Sabha elections | మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ షురూ.. గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని

Lok Sabha elections : దేశవ్యాప్తంగా మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో ఓటింగ్‌ ప్రారంభానికి ముందు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర క్యూలైన్‌లలో నిలబడ్డారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మూడో విడతలో భాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోగల 94 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అస్సాం (4), బీహార్ (5), ఛత్తీస్‌గఢ్‌ (7), దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యు (2), గోవా (2), గుజరాత్ (26), కర్ణాటక (14), మహారాష్ట్ర (11), ఉత్తరప్రదేశ్ (10), వెస్ట్ బెంగాల్ (4), మధ్యప్రదేశ్ (8) లలో ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది.

కాగా, మూడో విడత లోక్ సభ ఎన్నికల్లో పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్ యాదవ్ పోటీలో ఉన్నారు. పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కట్టుదిట్టంగా బలగాలను మోహరించింది.

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాని గత మూడు పర్యాయాలుగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బరిలో దిగుతున్నప్పటికీ ఆయనకు అక్కడ ఓటు హక్కులేదు. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌ కాబట్టి గుజరాత్‌లోనే ఆయనకు ఓటు ఉంది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా అక్కడ పోలింగ్‌ జరుగుతోంది.