Vande Bharat Sleeper | వందే భారత్‌ స్లీపర్‌ ఫుడ్‌ మెనూ ఇదే.. బెంగాలీ, అస్సాం సంప్రదాయ వంటకాలతో

వందే భారత్ స్లీపర్‌లో బెంగాలీ, అస్సామీ రుచులు! విమాన స్థాయి సౌకర్యాలు, 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలులో వీఐపీ కోటాకు చెక్. హౌరా-గౌహతి తొలి స్లీపర్ రైలు విశేషాలు మీకోసం..

Vande Bharat Sleeper

దేశంలోని మొట్టమొద‌టి వందేభార‌త్ స్లీప‌ర్ (Vande Bharat Sleeper) రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. హౌరా-గౌహతి మధ్య తొలి స్లీపర్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం ఈ రైలు గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రైలులో ఫుడ్‌ మెనూ (Vande Bharat Sleeper Train Food Menu) గురించి తెగ చర్చించుకుంటున్నారు. వందే భారత్‌లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సహకారంతో గౌహతిలోని మేఫెయిర్‌ స్ప్రింగ్‌ వ్యాలీ రిసార్ట్‌.. బెంగాలీ, అస్సాం సంప్రదాయ వంటకాలతో ప్రత్యేకంగా మెనూను రూపొందించింది.

బెంగాలీ స్పెషల్‌

బెంగాలీ స్పెషల్‌ డిషెస్‌ అయిన బాసంతి పులావ్‌, ఛోలార్‌ దాల్‌, మూంగ్‌ దాల్‌, ధోకర్‌ వంటి సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. వీటిని మీడియం స్పైసీతో అందరికీ నచ్చే విధంగా తయారు చేశారు. సుదూర ప్రయాణం చేసేవారికి కూడా ఈ ఫుడ్‌ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

అస్సాం స్పెషల్స్‌..

బెంగాలీ వంటకాలతోపాటూ అస్సాం పాక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ మెనూలో జోహా రైస్‌, మతి మోహోర్‌, మసూర్‌ దాల్‌, సీజనల్‌ వెజిటబుల్‌ ఫ్రైస్‌ ఉన్నాయి. ఇక స్వీట్స్‌లో సందేశ్‌, నారికోల్‌ బర్ఫీ, రసగుల్లాలను చేర్చారు.

వందే భారత్‌ స్లీపర్‌ ప్రత్యేకతలు..

వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. ప్రయాణికులకు విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి ఉంటుంది. ఎందుకంటే, విమానం తరహాలో ప్రయాణికులకు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. విమాన సిబ్బంది తరహాలోనే స్లీపర్‌ రైలులోని ప్రతీ సిబ్బంది యూనిఫాం ధరిస్తారు. ఈ రైలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్‌ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. వందే భారత్‌ స్లీపర్‌ రైలులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్‌, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. అందులో థర్డ్‌ ఏసీ కోచ్‌లో 611, సెకండ్‌ ఏసీ కోచ్‌లో 188, ఫస్ట్‌ ఏసీ కోచ్‌లో 24 ఉంటాయి. రైలు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది.

సేఫ్టీ ఫీచర్స్‌..

రైలులో ఫైర్‌ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్‌ వద్ద అత్యవసర స్టాప్‌ బటన్స్‌ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్‌ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. అలాగే, రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్‌ ఆధారిత డిస్‌ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు వంటి సౌకర్యాలు వంటివి ప్రయాణికులను ఆకర్షించనున్నాయి.

టాయిలెట్‌లో ఎలాంటి బటన్‌ నొక్కకుండానే నీళ్లు వస్తాయి. ఒక కోచ్‌ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్‌ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ యూనిట్‌ సైతం ఉంటుంది. ప్రతి కోచ్‌లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్‌ పెట్టుకునేందుకు ప్రతి బెర్త్‌ వద్ద సాకెట్‌ ఉంటుంది. అలాగే, బెర్త్‌ వద్ద చిన్న లైట్‌ సైతం ఉంటుంది. దాంతో ఎవరైనా బుక్‌లు, పేపర్‌ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. సేఫ్టీ ‘కవచ్’ సిస్టమ్, బ్లాట్‌ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య దాదాపు 16-20 మధ్య ఉంటుంది.

నో వీఐపీ కోటా, నో ట్రావెల్‌ పాస్‌..

భారతదేశపు మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ రైలు కేవలం సామాన్య ప్రజల కోసమే. ఇందులో వీఐపీ కోటా ఉండదు. అంతేకాదు అత్యవసర కోటాలకు కూడా అనుమతి ఉండదు. రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్‌ అధికారులు కూడా సాధారణ ప్రయాణికుల్లానే ఇందులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎలాంటి ట్రావెల్‌ పాస్‌లను అనుమతించరు. ఈ రైలులో ప్రయాణికులకు కేవలం కన్ఫర్మ్‌ అయిన టికెట్లను (Confirmed Tickets) మాత్రమే జారీ చేస్తారు. దీని వల్ల వెయిటింగ్‌ లిస్ట్‌ సమస్య గణనీయంగా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి :


Karnataka DGP Ramachandra Rao : ఆఫీసులో డీజీపీ ర్యాంకు అధికారి రాసలీలలు..వీడియో వైరల్
Outsourcing Corporation | ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్‌?

Latest News