ఉత్తరభారతంలో చలి పంజా విసురుతున్నది. పలుచోట్ల గడ్డకట్టే చలి పరిస్థితులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
Weather | ఉత్తరభారతంలో చలి పంజా విసురుతున్నది. పలుచోట్ల గడ్డకట్టే చలి పరిస్థితులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలిగాలులతో ఆది, సోమవారాల్లో కొనసాగుతాయని.. ఆ తర్వాత పరిస్థితి కొంత మారవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. ఉదయం కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో రోడ్లపై వాహనాలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు 6-20 డిగ్రీల సెల్సియస్ మధ్య రాబోయే ఐదురోజుల పాటు ఉండవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు ఉంటుందని తెలిపింది. పగలు ఆకాశం నిర్మలంగా ఉంటుందని పేర్కొంది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా కొనసాగినా కొంత పరిస్థితిలో మెరుగుదల ఉండగా విజిబులిటీ పెరిగింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విజిబులిటీ మెరుగైనా కొన్ని విమానాలు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశారు. తక్కువ దృశ్యమానత కారణంగా హిమాచల్లోని ధర్మశాలలో విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ వెలుపల కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా ఢిల్లీకి వచ్చే కనీసం 11 రైళ్లు 6 గంటల వరకు ఆలస్యంగా నడిచాయి.
వీటిలో ఖజురహో-కురుక్షేత్ర ఎక్స్ప్రెస్, అంబేద్కర్నగర్-కత్రా ఎక్స్ప్రెస్, పూరీ-న్యూఢిల్లీ, పురుషోత్తం ఎక్స్ప్రెస్, బెంగళూరు-నిజాముద్దీన్ రాజధాని రైళ్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈశాన్య భారతంలోని పలుచోట్ల చలి పరిస్థితులు కొనసాగుతుండగా.. రాబోయే ఐదురోజుల్లో సిక్కిం, అరుణాచల్ప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. హర్యానా రాష్ట్రంలోనూ చలి తీవ్రంగానే ఉన్నది. రోహ్తక్, నార్నాల్, రేవారీ, ఝజ్జర్ మరియు సోనిపట్ సహా హర్యానా రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా విరుసురుతున్నది. రేవారిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 14.5 డిగ్రీల సెల్సియస్ , కనిష్ఠ ష్ణోగ్రత 7.0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీనికి తోడు రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి. చలి నేపథ్యంలో పాఠశాల సమయాలను మార్చారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి.