TATA Air Lines | ఏవియేషన్లో పయనీర్.. ఎయిర్ ఇండియా చరిత్ర ఇదీ..

TATA Air Lines | భారతదేశంలో ఎయిర్ ఇండియాకు ఘనమైన చరిత్రే ఉన్నది. 1932లో టాటా సన్స్ చైర్మన్ జేఆర్డీ టాటా 1932లో ఎయిర్ ఇండియాను స్థాపించారు. టాటా సన్స్ గ్రూపు 1868లో ఏర్పడింది. 19వ శతాబ్దం చివరిలో అమెరికాలో తలెత్తిన సివిల్ వార్తో నాటి బాంబే కాటన్ పరిశ్రమ ఉవ్వెత్తున ఎగిసింది. టాటా సన్స్ మూలాలు కూడా అందులోనే ఉన్నాయి. అప్పట్లో పత్తి వ్యాపారం ప్రారంభించిన జెమ్షెడ్జీ నుస్సేర్వంజీ టాటా.. ఒక పెద్ద ఐరన్, స్టీల్ కర్మాగారాన్ని స్థాపించాలని, గొప్ప హోటల్ నిర్మించాలని, ప్రఖ్యాత విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని, జల విద్యుత్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని కలలుకనేవాడు. ఆ కలలు ఒక్కోటీ సాకారమవుతూ.. నేడు టాటా వంశం.. ప్రపంచంలో అతిపెద్ద కుటుంబాల్లో ఒకటిగా విస్తరించింది.
జెమ్షెడ్జీ టాటా మని మనుమడు జేఆర్డీ టాటా.. 1932లో టాటా ఎయిర్ సర్వీసెస్ను ప్రారంభించారు. ఆ తొలి విమానాన్ని నడిపింది కూడా జేఆర్డీ టాటయే కావడం విశేషం. సింగిల్ ఇంజిన్ కలిగిన ఆ తొలి విమానం మెయిల్స్ను కరాచీ నుంచి ముంబైకి తీసుకుని వచ్చింది. ఇదే సంస్థ 1946లో ఎయిర్ ఇండియాగా పేరు మార్చుకున్నది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1953 నాటికి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఆప్పటి కేంద్ర ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్స్ చట్టం తీసుకొచ్చి, అందులో సింహభాగం షేర్లను కొనుగోలు చేసింది. 1977 వరకూ ఎయిర్ ఇండియాకు చైర్మన్గా జేఆర్డీ టాటా వ్యవహరించారు. కొన్ని దశాబ్దాల పాటు భారతదేశ ఏవియేషన్కు చిహ్నంగా ఎయిర్ ఇండియా భాసిల్లింది. కానీ.. ఆర్థిక నిర్వహణలో లోపాలు, లెక్కకు మించిన సిబ్బంది, బ్యూరోక్రాటిక్ ప్రభావాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది. 2000 సంవత్సరం నాటికి భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ప్రైవేటు క్యారియర్స్ పోటీని తట్టుకోలేక ఇండియన్ ఎయిర్లైన్స్లో విలీనం అయిన తర్వాత దాని పరిస్థితి మరింత దిగజారిపోయింది.
నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరించే క్రమంలో 2020లో ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ సంస్థను స్థాపించిన టాటా సన్స్ అదే సంస్థను 2021లో తిరిగి సొంతం చేసుకున్నది. 2.4 బిలియన్ డాలర్లు వెచ్చించి.. బిడ్ను గెలిచింది. 2022 జనవరిలో అప్పగింతలు పూర్తయ్యాయి.