Formula-E car race | ఆ సొమ్ము ఎందుకు వెనక్కు తీసుకోవడం లేదు? ఫార్ములా ఈ రేస్‌ నోటీసులపై కేటీఆర్‌ రియాక్షన్‌

ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా, సాధికారికంగా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు తనకు ఈరోజు పంపించాడని కేటీఆర్ విమర్శించారు.

  • By: TAAZ    news    Jun 13, 2025 7:51 PM IST
Formula-E car race | ఆ సొమ్ము ఎందుకు వెనక్కు తీసుకోవడం లేదు? ఫార్ములా ఈ రేస్‌ నోటీసులపై కేటీఆర్‌ రియాక్షన్‌

Formula-E car race | ఫార్ములా-ఈ కారు రేసులో పదే పదే తనకు నోటీసులు ఇచ్చే డ్రామాలు ఆపి, లై డిటెక్టర్ పరీక్షకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇద్దరిపై ఏసీబీ కేసులున్న నేపథ్యంలో ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నదా? అని కేటీఆర్ సవాల్ చేశారు. నోటీసుల పేరుతో ప్రజల దృష్టి మరల్చేందుకు జోకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్ని నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జోకర్ ముఖ్యమంత్రిని వదిలిపెట్టబోమన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరన్న వాస్తవాన్ని ఈ దద్దమ్మ సీఎం, ఈ వైఫల్యాల కాంగ్రెస్ సర్కారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి..తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పరిపాలన చేతకాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసుల పేరుతో నాటకాలు ఆడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు.

రూ.44కోట్లు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు ?

ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా, సాధికారికంగా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు తనకు ఈరోజు పంపించాడని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఎంతగానో పేరు తీసుకువచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్న 44 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం ఉద్దేశాపూర్వకంగా పక్కనపెట్టి, నోటీసుల పేరుతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేశారన్నారు. తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన, విచారణ పేరుతో సాగదీసినా ఫార్ములా ఈ అంశం సంపూర్ణ పారదర్శకంగా జరిగిందని, ఈ విషయం అందరికీ తెలుసు అని కేటీఆర్ అన్నారు.

విచారణల పేరుతో ప్రజాధనం వృథా

చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవుతానని..విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానన్నారు. అయితే ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలన్నారు. లై డిటెక్టర్ పరీక్ష ద్వారా ఎవరు నేరస్తులో తెలంగాణ ప్రజలు తేల్చేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.