IPO News: ఐపీవో బాటలో.. మరో రెండు కంపెనీలు..

ఢిల్లీ: పార్క్ బ్రాండ్ పేరుతో 13 NABH అక్రెడిటెడ్ మల్టీ-సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న పార్క్ మెడి వరల్డ్ లిమిటెడ్ తమ ఐపీవోకి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను (డీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. షేర్ల జారీ ద్వారా రూ. 1,260 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 2గా నిర్ణయించారు. ఆఫర్లో భాగంగా తాజాగా రూ. 960 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ విధానంలో రూ. 300 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. 2024 సెప్టెంబర్ 30 నాటి గణాంకాల ప్రకారం (మూలం: క్రిసిల్ నివేదిక) 3,000 పడకల సామర్థ్యంతో పార్క్ మెడి వరల్డ్ ఉత్తర భారతదేశంలో రెండో అతి పెద్ద ప్రైవేట్ ఆస్పత్రుల చెయిన్గా నిలిచింది. హర్యానాలో 1,600 పడకలతో రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చెయిన్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నువామా వెల్త్ మేనేజ్మెంట్, సీఎల్ఎస్ఏ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్ ప్రైవేట్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా పనిచేస్తున్నాయి.
జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్…
జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి (ఐపీవో) సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను (డీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. 2022-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆదాయంపరంగా భారత్లో అతి పెద్దదైన, వేగంగా వృద్ధి చెందుతున్న నాన్-ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ దిగ్గజంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇష్యూ ద్వారా రూ. 2,000 కోట్ల వరకు సమీకరించనుండగా, తాజాగా రూ. 500 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్ సెల్లింగ్ షేర్హోల్డరు కమలేష్ జైన్ రూ. 1,430 కోట్ల వరకు, ఇతర సెల్లింగ్ షేర్హోల్డర్ మయాంక్ పరీక్ రూ. 70 కోట్ల వరకు విలువైన షేర్లను విక్రయించనున్నారు. కంపెనీకి కమలేష్ జైన్ ప్రమోటరుగా వ్యవహరిస్తున్నారు.
దాదాపు ఏడు దశాబ్దాల ఘన వారసత్వంతో, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్ సంస్థ నాన్-ఫెర్రస్ మెటల్ స్క్రాప్ను రీసైక్లింగ్ చేయడం ద్వారా నాన్-ఫెర్రస్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో లెడ్ ఇన్గోట్ బ్రాండ్ను లిస్ట్ చేసిన రెండు దేశీ రీసైక్లింగ్ కంపెనీల్లో జైన్ రిసోర్స్ ఒకటి. దీనితో అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తృత స్థాయిలో కస్టమర్లకు ఉత్పత్తులను అందించే అవకాశం కంపెనీకి లభిస్తుంది. బీఆర్ఎల్ఎంలతో సంప్రదింపుల ఆధారంగా రూ. 100 కోట్ల వరకు ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్ చేపట్టే అంశాన్ని కంపెనీ పరిశీలించనుంది. ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్ పూర్తయితే, సమీకరించిన మొత్తాన్ని తాజా ఇష్యూ నుంచి తగ్గిస్తారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను నిర్దిష్ట రుణాలను చెల్లించడం కోసం, ఇతర కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది. డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, పీఎల్ క్యాపిటల్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.