విధాత : బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వెనుకబడటంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న 400సీట్ల అంచనాలకు భారీ గండి పడింది. చివరకు అయోధ్య రామాలయం కొలువైన ఫైజాబాద్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి దిశగా సాగుతుంది. యూపీలోని మొత్తం 80స్థానాల్లో బీజేపీ 34స్థానాల్లో, ఎస్పీ 34స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఆరెఎల్డీ 2, ఏఎస్పీకేఆర్ 1స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే యూపీలో బీజేపీ 27స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజార్టీ మార్కు 272 సీట్లను కూడా అందుకోలేని దుస్థితిలో పడిపోయింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న యూపీతో పాటు మహారాష్ట్ర, బీహార్, హర్యానా రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది.