Bomb threat to tenth Exams | సీబీఎస్ఈ పదో తరగతి( CBSE Tenth Exams ) పరీక్షల వేళ ఓ విద్యార్థి తను చదువుతున్న పాఠశాలకు బాంబు బెదిరింపు సందేశం పంపాడు. పోలీసుల తనిఖీల అనంతరం పాఠశాలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. మరి విద్యార్థి బాంబు బెదిరింపు సందేశం ఎందుకు పంపాల్సి వచ్చిందంటే..? పరీక్షల వాయిదా కోసమేనని పోలీసుల విచారణలో తేలింది.
గుజరాత్ వడోదరలోని మకరపుర కేంద్రీ విద్యాలయం నంబర్ 3లో ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అయితే పది వార్షిక పరీక్షల వేళ అతను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. పరీక్షలు వాయిదా పడితే బాగుండు అని అనుకున్నాడు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి సదరు విద్యార్థినే అతి తెలివి ప్రదర్శించాడు.
ఇక గూగుల్ నుంచి సాంకేతికతను ఉపయోగించి.. అంతర్జాతీయ నంబర్ +1తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి మ్యాథ్స్ టీచర్కు వాట్సాప్లో సందేశం పంపాడు. రేపు మీ స్కూల్ పూర్తిగా ధ్వంసం కానుంది. దేవుడు గొప్పవాడు. అల్లాహు అక్బర్ అని రాశాడు. ఈ సందేశం మార్చి 5వ తేదీన తెల్లవారుజామున 3.43 గంటలకు వచ్చింది. ఈ సందేశాన్ని ఉదయం 8 గంటలకు చూసుకుని అప్రమత్తమైన మ్యాథ్స్ టీచర్.. ప్రిన్సిపల్కు సమాచారం చేరవేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాంబు, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. దీంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ ఘటనపై మొదట పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం వాట్సాప్ సందేశాన్ని లోతుగా విశ్లేషించడంతో.. స్కూల్ విద్యార్థినే ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఈ విషయం మార్చి 12న వెలుగు చూసింది.
సదరు విద్యార్థి పరీక్షల భయంతో మానసిక ఒత్తిడికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బోర్డు ఎగ్జామ్స్ జరిగే వేళ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, పాజిటివ్ దృక్పథంతో ఆలోచించేలా తరగతులు నిర్వహించాలని పోలీసులు సూచించారు.
