delhi cm arvind kejriwal sensational comments about free welfare schemes
అప్పుచేయకుండా ఉచితాలు ఎలా ఇస్తారని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి డిల్లీ సీఎం సంచలన విషయాలు వెల్లడించారు.
జర్నలిస్టు: నేనొక ప్రశ్న అడగాలను కుంటున్నానను. ఈ అంశంపై చాలాసార్లు మీపై ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. గెలవడం కోసం ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు ఇస్తుంటారని ఆరోపణ. మీకు లెక్కల గురించి బాగా తెలుసు. ఇండియన్ రెవెన్యూ సర్వీసులో పనిచేశారు గనుక ఆదాయ వ్యయాల గురించి మీకు తెలుసు. పన్ను ఎలా వసూలు చేస్తారు? ఏయే అంశాల ప్రాతిపదికగా చేస్తారు? మీకు బాగా తెలుసు. ఇలా ఉచితాల ప్రాతిపదికన రాజకీయాలు దీర్ఘకాలం మనగలుగుతాయా? ఇలా రాజకీయాలు చేయడం మంచి రాజకీయమేనంటారా?
కేజ్రీవాల్: చాలా మంచి రాజకీయాలంటాను. అందరూ ఇలాగే చేయాలని చెబుతాను. ఇలా ఎందుకు చెబుతున్నానో మీకు వివరిస్తాను. ఈ రాజకీయాల లెక్కలు కూడా మీకు వివరిస్తాను. ఇందులో ఉండే రిస్కు గురించి కూడా చెబుతాను. అన్నింటికంటే ముందు మౌలికమైన అంశం- మొత్తం మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. వారికి ఉచిత విద్యుత్ ఇస్తన్నప్పుడు దానిని ఉచితం అనరు. కానీ ప్రజలకు ఇస్తేమాత్రం దానిని ఉచితం అంటారు. వారికి ఒక్కొక్కరికి నాలుగు వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. నేను ప్రజలకు ఒక్కొక్కరికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తేమాత్రం వీరందరికీ బాధ కలుగుతుంది ఎందుకని? ఈ మంత్రులందరికీ అనుభవిస్తున్న సదుపాయం ప్రజలందకి ఇస్తే ఏమిటి ఇబ్బంది? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటి ఖర్చులన్నీ ఉచితం. వీరి ఇంట్లో ఎవరికయినా రోగమొస్తే వైద్యం మొత్తం ఉచితం. నేను ఢిల్లీ ప్రజల వైద్య ఖర్చులన్నీ ఉచితం చేస్తే వీరికి ఎందుకు బాధ? ఈ మంత్రులకు, వారి అనుచరులకు లభించే ఉచితాలన్నీ నేను ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాను. నాకు రాజకీయాల్లో ఒక దశ గురించి బాగా తెలుసు. ఉచితాలు ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో ప్రభుత్వాలు అప్పులు తెచ్చి ఉచితాలకు ఉపయోగించేవారు. అది మంచి ఆర్థిక ఆచరణ కాదు.
నేను అప్పు తెచ్చి ఉచితాలు ఇస్తే పొరపాటే. ఉన్న ఆదాయంలోంచే ఉచితాలు ఇస్తే అది మంచిది. ఢిల్లీ ప్రభుత్వం అప్పులు తేలేదు. లోటులో లేదు. దేశంలో అందరికీ తెలుసు. 2019 సీఏజీ నివేదిక ప్రకారమే మేము మిగులు బడ్జెట్తో ఉన్నాము. మా కన్నా ముందు ఢిల్లీ ప్రభుత్వం లోటులో నడిచింది. మేము అధికారానికి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఒక్కటే దేశంలో మిగులు బడ్జెట్తో పనిచేస్తున్నదని సీఏజీ నివేదిక పేర్కొంది. కొత్త పన్నులు వేయలేదు. అప్పులు తేలేదు. మిగులు బడ్జెట్తో నడుపుతున్నాము. అవినీతిని అరికట్టి డబ్బు ఆదా చేసి ప్రజలకు సదుపాయాలు ఇస్తే అదేమైనా చెడ్డపనా? ఇది మంచి ఆర్థిక సంప్రదాయం.
నేనొక ఉదాహరణ చెబుతాను. ఉచిత మెడిసిన్స్ ఇచ్చే పథకం ఎలా అమలులోకి వచ్చిందో చెబుతాను. మేము ఒక ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాము. ఆ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 325 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ ఫ్లై ఓవర్ను 175 నుంచి 200 కోట్ల రూపాయల లోపు వ్యయంతోనే పూర్తి చేసి, వంద నూట యాభై కోట్ల రూపాయలను మిగిల్చాము. కేబినెట్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఉచిత మెడిసిన్స్ ఇచ్చే పథకానికి ఎంతఖర్చవుతుందని అడిగితే సుమారు ౩౦౦ కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఒక్క ఫ్లై ఓవర్ నిర్మాణంలోనే ఇంత మిగిల్చగలిగితే ఉచిత మెడిసిన్స్ పథకం అమలు చేయలేమా అనుకున్నాం. అలా ఉచిత మెడిసిన్స్ పథకం అమలులోకి తెచ్చాం.
మరో ఉదాహరణ చెబుతాను. ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి అనుకుంటా. ఆయన తనకోసం 190 కోట్లు వెచ్చించి ఒక విమానం కొన్నారు. నేను నాకోసం ఏమీ కొనుక్కోలేదు. అందుకు బదులు 150 కోట్ల రూపాయలతో ఢిల్లీలోని తల్లులు పిల్లలకు బస్సు చార్జీలు లేకుండా చేశాను. అందులో తప్పేముంది. మంచి రాజకీయాలు, ఉత్తమ ఆర్థిక ఆచరణ చేసి చూపిస్తున్నాం.
జర్నలిస్టు: ఉచితాలు ఇస్తూ కూడా మిగులు ఆర్థిక ఆచరణ చేయగలుగుతున్నారంటే, మీ వద్ద ఉన్న ఫార్ములా ఏమిటి?
కేజ్రీవాల్: నీతీ, నిజాయితీ. ఇంకేమీ లేదు. నేను చాలా చిన్నవాడిని. ఐదేళ్ల పరిపాలనానుభవంతో చెబుతున్నాను-ఏ ప్రభుత్వానికీ నిధుల కొరత ఉండే అవకాశం లేదు. చాలా స్పష్టమైన ప్రకటన చేస్తున్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, ఏ కేంద్ర ప్రభుత్వంలో గానీ నిధుల కొరత లేదు. నీతికి సంబంధించిన కొరత ఉంది. నిజాయితీకి సంబంధించిన కొరత ఉంది.