Rahul Gandhi Vs EC | రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు : ఎన్నికల అక్రమాలపై మా వద్ధ పక్కా ఆధారాలు 

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..! సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఫేక్ ఓట్లు పోలయ్యాయని..ఈ మోసాలపై తాము స్వతంత్ర దర్యాప్తు నిర్వహించామని..మా వద్ధ అణుబాంబులాంటి ఆధారాలున్నాయని అన్నారు. బీజేపీ భారీ మెజారిటీకి కారణం ఈ నకిలీ ఓట్లే అంటూ ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Reported by: Tejaswini Nanna | రాజకీయాలు | Aug 02, 2025, 1:15 pm IST
Read Time: 6 mins
Rahul Gandhi Vs EC | రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు : ఎన్నికల అక్రమాలపై మా వద్ధ పక్కా ఆధారాలు 

Rahul Gandhi Vs EC | న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని..అందుకు మా దగ్గర పక్కాగా ఆధారాలున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందని..తన దగ్గర ఉన్న ఓ లోక్ సభ నియోజకవర్గం డేటాలో ఆరున్నర లక్షల మంది ఓటు వేస్తే అందులో లక్షన్నర ఓటర్లు ఫేక్ అని తేలిందని..ఓటర్ లిస్టు పరిశీలించామని..ఈ తరహా మోసంపైనే అధికార బీజేపీ మెజారిటీ ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. ఆధారాల కోసం 6 నెలలు పని చేశామని..బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడటంపై మేం దృష్టిపెట్టామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈసీ మేం కోరిన ఒరిజినల్‌ ఓటర్ లిస్ట్‌ మాకు ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. బీజేపీకి మరో 15-20 సీట్లు తక్కువగా వచ్చి ఉంటే మోడీ ప్రధాని మోడీ అయ్యేవారు కాదన్నారు. శ

నివారం న్యూఢిల్లీలో జరిగిన ఏఐసీసీ లా, హ్యూమన్ రైట్స్ ఆండ్ ఆర్టీఐ కాన్ క్లేవో 2025సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. 2014 నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఏదో తప్పు జరుగుతోందని తనకు అనుమానం ఉందని..గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపైన, సార్వత్రిక ఎన్నికలపైన తనకు అనుమానాలు ఉన్నాయని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటి? కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాకపోవడం ఏంటి? అని ఆయన తన సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఆగస్టు 5న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ శాంపిల్ గా ఓ నియోజకవర్గంలో నకిలీ ఓట్లపై హింట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

అంతకు ముందురోజు కూడా రాహుల్ గాంధీ పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల గోల్ మాల్‎కు పాల్పడుతున్నదన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద అణు బాంబులాంటి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. “ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని మాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది. మధ్యప్రదేశ్ లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల తర్వాత మరిన్ని అనుమానాలు పెరిగాయన్నాు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో ఓటర్ల లిస్టులో అదనంగా 1 కోటి కొత్త ఓటర్లను చేర్చినట్లు తెలియడంతో మా అనుమానాలు బలపడ్డాయి. మా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోదని అర్థమైంది. అందుకే మేమే ఆరు నెలలుగా స్వతంత్ర దర్యాప్తు నిర్వహించామన్నారు. అప్పుడే మాకు అణుబాంబులాంటి ఆధారాలు దొరికాయి. అది పేలినప్పుడు ఎన్నికల సంఘానికి దాక్కునే చోటు కూడా ఉండదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు దేశద్రోహం కంటే తక్కువేం కాదు. ఓట్ల చోరీలో పాల్గొన్న వారిని ఎవరినీ వదిలిపెట్టం. ఎక్కడ ఉన్నా, రిటైరయినా, మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు” అని రాహుల్ పేర్కొన్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ ఇప్పటికే తమపై చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకోవద్దంటూ ఎన్నికల అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి ఈసీని టార్గెట్ చేస్తూ మరిన్ని ఆరోపణలు చేయడం గమనార్హం.