Site icon vidhaatha

హ‌నుమంతుడికి వ‌డ‌మాల ఎందుకు స‌మ‌ర్పిస్తారు..? ర‌హ‌స్యం ఏంటంటే..?

ప్ర‌తి మంగ‌ళ‌వారం హ‌నుమంతుడిని భ‌క్తులు పూజిస్తారు. ఎందుకంటే ఆ రోజున ఆంజ‌నేయుడిని పూజిస్తే కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌న ఇంటికి స‌మీపంలో ఉన్న హ‌నుమాన్ ఆల‌యానికి వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తుంటారు. త‌మ‌ల‌పాకుల‌తో గానీ, సింధూరంతో గానీ పూజిస్తే మ‌నం కోరుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ రెండింటితో పాటు వ‌డ‌మాల‌ను కూడా హ‌నుమంతుడికి స‌మ‌ర్పిస్తారు. ఈ వ‌డ‌మాల స‌మ‌ర్ప‌ణ వెనుకాల ఉన్న ర‌హ‌స్యం ఏంటో తెలుసుకుందాం.

వడ మాల ఎందుకు సమర్పిస్తారు..?

చాలా మంది భ‌క్తులు మంగ‌ళ‌వారం రోజున హ‌నుమంతుడికి విశేషంగా వ‌డ‌మాల‌లు స‌మ‌ర్పిస్తుంటారు. ఈ వ‌డ‌మాల స‌మ‌ర్ప‌ణ వెనుకాల ఉన్న ర‌హ‌స్యం ఏంటంటే..ఆంజ‌నేయుడు ఒక‌సారి రావ‌ణుడి నుంచి శ‌ని దేవుడిని ర‌క్షించాడు. అందుకు శ‌ని దేవుడు హ‌నుమంతుడిని ఆశీర్వ‌దిస్తాడు. ఆంజ‌నేయుడిని కొలిచిన వారికి శ‌ని బాధ‌లు ఉండ‌వ‌ని వ‌రం ఇస్తాడు. కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమకు సమర్పించినట్లైతే శని భగవానుని అనుగ్రహం పొంది మనలను పీడించే శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ శ్లోకాన్ని ప‌ఠిస్తే మ‌నోధైర్యం క‌లుగుతుంది..

క్లిష్ట సమయాలలో అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే ఒంటె వాహనారూఢుడైన హనుమను దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించ గల మనోధైర్యం కలుగుతుంది. అలాగే ‘అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వధ రామదూతం కృపాసింధుమ్ మత్కార్యం సాధయ ప్రభో !’ అను ఈ శ్లోకాన్ని మంగళవారం చదువుకుంటే ఎంతటి కష్టమైనా పని అయినా హనుమంతుడి అనుగ్రహంతో సులభంగా పూర్తి అవుతుంది అని పండితులు అంటున్నారు.

Exit mobile version